Vande Bharat: విశాఖలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. కంచరపాలెంలో వందే భారత్ పై కొందరు దుండగులు రాళ్లు విసిరారు. ఆ రాళ్ల దాడితో రైలు కిటికీ అద్దాలు పగిలాయి. విశాఖ స్టేషన్ నుంచి కోచ్ కాంప్లెక్స్కు ట్రైన్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వందే భారత్ రైలుపై రాళ్లు విసిరిన దుండగుల కోసం రైల్వే పోలీసులు గాలిస్తున్నారు.
ఇటీవల బెంగాల్ లోనూ వందే భారత్ రైలుపై కొందరు రాళ్లు విసిరిన ఘటన అప్పట్లో రాజకీయంగా దుమారం లేపింది. కేంద్రం-బీజేపీ మీద కోపంతో టీఎంసీ కార్యకర్తలో ఈ రాళ్ల దాడికి పాల్పడ్డారని కమలనాథులు ఆరోపించారు. అయితే, ఆ దాడి జరిగింది బెంగాల్ లో కాదని.. బీహార్ లో అని ఆ తర్వాత విచారణలో తేలింది.
తాజాగా, విశాఖలో వందే భారత్ రైలుపై అదే విధంగా రాళ్ల దాడి జరగడం ఆకతాయిల పనిగా చూడలేం అంటున్నారు. కేంద్రంపై, మోదీ విధానాలపై ఆగ్రహంగా ఉన్న వర్గమే ఇలా రైలుపై రాళ్లు విసిరి ఉంటారని అనుమానిస్తున్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుండగా.. ఇప్పుడిలా వందే భారత్ రైలుపై రాళ్లతో దాడి చేసి కేంద్రానికి నిరసన సెగ తెలియజేశారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.