Tadipatri: అసలే సీమ. అందులోనూ తాడిపత్రి. టీడీపీ, వైసీపీల మధ్య వర్గపోరు తారాస్థాయిలో ఉన్న ప్రాంతం. అలాంటి చోట మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. ఇరుపార్టీలు పరస్పర రాళ్ల దాడులతో హైటెన్షన్ క్రియేట్ అయింది. విషయం తెలిసి జెడ్పీ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిలు తమ వారి తరఫున రంగంలోకి దిగడంతో మరింత ఉత్కంఠ. ఇంతకీ తాడిపత్రిలో ఏం జరిగిందంటే…
రాత్రి వేళ పక్కాగా జరిగింది రాళ్ల దాడి. ప్రజా సమస్యలపై గత 3 రోజులుగా మున్సిపాలిటీ పరిధిలో పర్యటిస్తున్నారు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి జేసీ అస్మిత్ రెడ్డి. ప్రస్తుతం అది వైసీపీ ఇలాఖా. టీడీపీ వాళ్లు పర్యటన చేస్తే ఊరుకోమనేలా.. వైసీపీ వర్గం దాడులకు తెగబడిందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. టీడీపీ వాళ్లే రెచ్చగొట్టారని అధికారపక్షం అంటోంది.
సాయంత్రం జేసీ అస్మిత్ రెడ్డి 3వ వార్డులో పర్యటిస్తుండగా ఘర్షణ జరిగింది. వైసీపీ కౌన్సిలర్ ఫయాజ్ బాషా బీడీ ఫ్యాక్టరీ దగ్గరకు.. టీడీపీ శ్రేణులు రాగానే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇళ్లపై నుంచి రాళ్ల దాడి చేశారు. వెంటనే తేరుకున్న తెలుగుదేశం కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. వైసీపీ వర్గీయుల రాళ్ల దాడి నుంచి తప్పించుకుని ఓ ఇంట్లోకి వెళ్లి దాక్కున్నారు జేసీ అస్మిత్ రెడ్డి.
విషయం తెలిసి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలవగా.. వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రాళ్ల దాడి జరిగిందని తెలీగానే.. జేసీ ప్రభాకర్ రెడ్డి స్పాట్ కు చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలను కలిసి ధైర్యం చెప్పారు. అటు, ఎమ్మెల్యే పెద్దారెడ్డి సైతం వచ్చి.. వైసీపీ శ్రేణులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నా. ఉద్రిక్తత మాత్రం కొనసాగుతోంది.