AP Students : మణిపూర్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు, పౌరుల తరలింపు కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీ విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రెండు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సొంత ఖర్చులతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విమానాలను ఏర్పాటు చేసింది. ఒక విమానం హైదరాబాద్కు, మరో విమానం కోల్కతాకు చేరుకోనుంది. అక్కడి నుంచి వారిని స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకున్నారు.
మణిపూర్ నుంచి మొదటి విమానం హైదరాబాద్ కు చేరుకుంటుంది. అందులో 108 మంది విద్యార్థులను తీసుకురానున్నారు. రెండో విమానం కోల్కతా కు చేరుకుంటుంది. అందులో 49 మంది విద్యార్థులను తీసుకురానున్నారు. మణిపూర్లో చిక్కుకున్న మొత్తం 157 మంది విద్యార్థులను ఈ విమానాల్లో రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఇక తెలంగాణ నుంచి మణిపూర్ వెళ్లి అక్కడ చదువుకుంటున్న విద్యార్ధులు, వివిధ పనుల కోసం వెళ్లిన వారు సోమవారం హైదరాబాద్కు రానున్నారు. ఇక్కడి నుంచి వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు రాష్ట్ర పభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అధికారులు వెల్లడించారు.
మణిపూర్లో చిక్కుకున్న ఒక తెలంగాణ విద్యార్థిని అధికారులు క్షేమంగా ఢిల్లీకి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీలోని అధికారుల చొరవతో ఆదివారం ఢిల్లీలోని విమానాశ్రయానికి చేరుకున్న విద్యార్థి.. రాత్రి 11 గంటలకు తెలంగాణ భవన్కు చేరుకున్నాడు. ఖమ్మం జిల్లా రాంనగర్ తండాకు చెందిన హర్షవర్ధన్ మణిపూర్ నిట్లో బీటెక్ చదువుతుండగా… ప్రభుత్వం సొంత ఖర్చులతో ఢిల్లీకి తీసుకొచ్చింది. తెలంగాణ భవన్లో విద్యార్థికి అధికారులు వసతి ఏర్పాట్లు చేశారు. సోమవారం స్వగ్రామానికి తరలిస్తామని అధికారులు తెలిపారు.