Manipur : ఘర్షణలు, హింసాత్మక ఘటనలతో మణిపూర్ అట్టుడుకుతోంది. ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ హింసాత్మకంగా మారినప్పటి నుంచి మణిపూర్ అట్టుడుకుతోంది. హింసాత్మక ఘటనలను నివారించేందుకు అక్కడి ప్రభుత్వం పారామిలటరీ బలగాలను సైతం మోహరించింది. హింసతో రగిలిపోతున్న మణిపూర్లో సైన్యం మరింత నిఘా పెంచింది. జాతుల మధ్య నెలకొన్న విభేదాల కారణంతో మణిపూర్లో చెలరేగిన అల్లర్లను అదుపు చేసేందుకు విధించిన కర్ఫ్యూ తాత్కాలికంగా సడలించారు. ఈ అల్లర్లతో దాదాపు 13 వేల మంది నిరాశ్రయులు కాగా 54 మంది ప్రాణాలు కోల్పోయారు.
హింసాత్మక ఘటనలతో మణిపూర్ ప్రభుత్వం వివిధ వర్గాలతో చర్చలు జరిపింది. చర్చల అనంతరం చురాచాంద్పుర్ జిల్లాలో పరిస్థితి కొంత మెరుగుపడనట్లు ఆ రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్ తెలిపారు. అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్ఐటీ, ఇంఫాల్ నీట్ సహా వివిధ విద్యాసంస్థల్లో ఏపీ, తెలంగాణకు చెందిన విద్యార్థులు చాలా మంది ఉన్నారు. హింసాత్మక ఘటనతో తీవ్ర భయాందోళనకు గురవుతున్న తెలుగు విద్యార్థులు తమను స్వస్థలాలకు చేర్చాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఒక్క ఎన్ఐటీ క్యాంపస్లో సుమారు 150 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఇందులో 70 మంది ఏపీకి చెందినవారుండగా మిగతావారు తెలంగాణకు చెందిన విద్యార్థులున్నారు. ప్రస్తుతం మణిపూర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో విద్యార్థులంతా గదులకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఆహారంతోపాటు మంచినీరు కూడా దొరక్క తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ పిల్లల పరిస్థితిపై ఇక్కడున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హింసాత్మకంగా మారిన మణిపూర్లో చిక్కుకున్న విద్యార్థులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.
మణిపూర్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణకు చెందిన దాదాపు 250 మంది విద్యార్థులను ఇంఫాల్ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానం ద్వారా తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇదే అంశంపై మణిపూర్ సీఎస్తో తెలంగాణ సీఎస్ శాంతికుమారి మాట్లాడారు.
ఏపీ విద్యార్థుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మణిపూర్లో చదువుతున్న ఏపీ విద్యార్థులకు సహాయం అందించేందుకు వీలుగా ఢిల్లీలోని ఏపీ భవన్లో కంట్రోల్రూం ఏర్పాటు చేసింది. మణిపూర్ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని.. అక్కడున్న విద్యార్థులు కంట్రోల్ రూం హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు హెల్ప్లైన్ల నంబర్లకు ఫోన్చేసి తమ పిల్లల సమాచారం అందించాలంటున్నారు ఏపీ అధికారులు.
మణిపూర్ అల్లర్లపై కేంద్ర మత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మణిపూర్లో హింసాత్మక ఘటనలు చెలరేగడం దురదృష్టకరమన్నారు. కొన్ని కులాల మధ్య ఘర్షణ జరుగుతోందని.. దీనిపై ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్లు తెలిపారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కర్ఫ్యూ సడలించామని, పరిస్థితి అదుపులో ఉందన్నారు కిషన్రెడ్డి. మణిపూర్ అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షిస్తున్నారని.. త్వరలోనే మణిపూర్లో సాధారణ పరిస్థితి ఏర్పాడుతాయని కిషన్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.