Purandeswari Delhi Tour : ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఢిల్లీ పర్యటన మూడోరోజుకు చేరుకుంది. ఏపీలో జరుగుతున్న లిక్కర్ అమ్మకాల్లో జగన్ భారీగా అవినీతికి పాల్పడుతున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు పురందేశ్వరి ఫిర్యాదు చేశారు. అంతేకాదు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపైనా షా తో చర్చలు జరిపారు. ఏపీలో మద్యం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని పురందేశ్వరి అమిత్షాను కోరారు. ఒక్క మద్యం అమ్మకాల్లోనే సంవత్సరానికి 25వేల కోట్ల రూపాయల భారీ అవినీతి జరుగుతుందన్నారు.
అదేవిధంగా.. కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిధులను జగన్ పక్కదారి పట్టిస్తున్నట్లు పురందేశ్వరి కేంద్రమంత్రులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. గతంలో ఏపీలో కల్తీ మద్యం తాగి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడా లేనన్ని లోకల్ బ్రాండ్లు ఏపీలోనే ఉన్నాయని, మద్యం తాగాలంటేనే భయమేస్తుందని మందుబాబులు సైతం ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు ఏపీ బీజేపీ చీఫ్ ఢిల్లీ టూర్పై వైసీపీ నేతలు విమర్శలు మొదలెట్టారు. చంద్రబాబును కాపాడేందుకే పురందేశ్వరి ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలుస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబును బెయిల్ పై బయటికి తీసుకొచ్చేందుకు ఆమె తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. కాగా.. ఏపీలో ఇప్పటికే టీడీపీ-జనసేన పొత్తు ఖాయమైంది. ఈసారి ఎన్నికల్లో జనసేన.. బీజేపీతో కలిసి పోటీ చేస్తుందని భావిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్, ఆ వెంటనే పవన్ టీడీపీతో పొత్తు ప్రకటించడం వెంటవెంటనే జరిగిపోయాయి. బీజేపీతో కలిసి పోటీచేయడం లేదని పవన్ చెప్పేశారు.
వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ను గద్దె దింపడమే జనసేన-టీడీపీ లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ రెండు పార్టీలకూ బీజేపీ సపోర్ట్ ఇస్తుందా ? లేక సింగిల్ గానే బరిలోకి దిగుతుందా తెలియాలంటే ఢిల్లీ టూర్ పూర్తికావాల్సి ఉంది. ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు రావడంతోనే ఆమె ఢిల్లీకి వెళ్లారు. పొత్తులపై చర్చించేందుకే పిలిపించారని వార్తలొచ్చిన నేపథ్యంలో.. పురందేశ్వరి ఢిల్లీ టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొందరు నేతలు మాత్రం.. పురందేశ్వరి పొత్తుల విషయంలో గుడ్ న్యూస్ తోనే తిరిగి వస్తారని ఆశిస్తున్నారు.