శ్రీకాళహస్తి ఆలయంలో గోడ కూల్చివేత రాజకీయ రచ్చకు దారి తీసింది. వైసీపీ వర్సస్ టీడీపీల మధ్య డైలాగ్ వార్తో గోడ వివాదం ముదురుతోంది. ఆలయంలో పురాతన భాగాన్ని తొలగించారని అధికార పార్టీ నేతలు చెబుతుంటే.. కాదు అన్యాయాలు జరగుతున్నాయని.. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని ఆరోపిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. దీంతో శ్రీకాళహస్తి గోడ కూల్చివేత ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది.
శ్రీకాళహస్తి దక్షిణామూర్తి విగ్రహం ఎదురుగా ఎడమవైపున వంటశాలకు పక్కన సిమెంట్ గోడను అధికారులు తొలగించారు. ఆ ప్రాంతంలో ఆశీర్వాద మండపం ఏర్పాటు చేయాలని గత ఎనిమిది నెలల క్రితం పాలకమండలి తీర్మానంలో తీర్మానించినట్లు సమాచారం. అయితే ఆర్కియాలజీ కి సమాచారం ఇవ్వకుండా పాలకమండలి సొంతంగా తొలగించిందని ఆరోపిస్తోంది తెలుగు దేశం పార్టీ. ఈ మేరకు ఆలయాన్ని పరిశీలించారు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల సుధీర్ రెడ్డితోపాటు పలువురు పార్టీ శ్రేణులు. ఆలయంలోని మృత్యుంజయ స్వామికి పక్కనే ఉన్న పురాతన గోడలను తొలగించడంపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయానికి వచ్చే ప్రముఖులకు ఆశీర్వాదం చేయడానికి తగిన స్థలం లేదనే సాకుతో పురాతన గోడలను తొలగించడం అన్యాయమన్నారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకొని విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
మరోపక్క ఇదే అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. చేసిన పాపాలు పోవాలని, సన్మార్గంలో నడిచేలా దీవించాలని భక్తులంతా శ్రీకాళహస్తీశ్వర స్వామిని వేడుకుంటారు. అలాంటిది అధికారమదం తలకెక్కిన వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాత్రం శ్రీకాళహస్తి సన్నిధిలోనే పాపాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. స్వామి, అమ్మవార్లకే అపచారం తలపెడుతున్నాడని ఫైర్ అయ్యారు. పురాతన శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకి నైవేద్యాలు తయారుచేసే గది, మృత్యుంజయ పూజలు నిర్వహించే ప్రదేశంలో వేల ఏళ్ల నాటి చారిత్రక కట్టడాలను కూల్చేయిస్తున్నారన్న ఆయన.. పురావస్తు, దేవాదాయ శాఖ నిబంధనలు పట్టించుకోకుండా, వీఐపీల ఆశీర్వాదాల కోసం తవ్వకాలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. చారిత్రక, పురావస్తు, ఆధ్యాత్మిక సంపద ధ్వంసం చేయడం నిబంధనలకు విరుద్ధమే కాదు, పాపమని.. ఆలయంలో తవ్వకాలకు కారకులపై చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.
.
.