Special Story: పెళ్లి కాని ప్రసాద్ అంటే మొదటగా మనకు గుర్తుకు వచ్చేది మల్లీశ్వరి సినిమాలో నటించిన హీరో వెంకటేష్. కానీ హీరో వెంకటేష్ కు నిజజీవితంలో వివాహమై ఇద్దరు ఆడపిల్లలు సంతానం కూడా. అలాగే సినిమాలో కూడా పెళ్లి కాని ప్రసాద్ బ్రాండ్ తో చివరకు హీరోయిన్ కత్రీనా కైఫ్ ను పెళ్లి చేసుకుంటాడు వెంకటేష్. ఆ సినిమాలో పెళ్లి కాని ప్రసాదులా అందరితో పిలువబడే వెంకటేష్ క్యారెక్టర్.. నేటి సమాజంలో మనకు ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం అమ్మాయిల డిమాండ్స్ ఎక్కువగా ఉండడమే అంటున్నారు పెళ్లి కాని ప్రసాదులు.
లవ్ అనేది రెండు మనసుల కలయిక. అదే పెళ్లైతే రెండు కుటుంబాలు కలిసిన అనంతరమే, మనసులు కలుస్తాయి. నాటి రోజుల్లో వివాహం నిశ్చయం కావాలంటే, వరుడి కుటుంబం చరిత్ర అదేనండీ.. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసేవారు. అలాగే అబ్బాయి గుణం గురించి ఆరా తీసేవారు. ఇప్పుడంతా ఆధునిక కాలం ట్రెండ్ మారింది. అబ్బాయిల సంఖ్యకు తగినంత అమ్మాయిలు లేరన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అందుకే కాబోలు నేటి వివాహాలకు అబ్బాయిల డిమాండ్స్ కంటే.. అమ్మాయిల డిమాండ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయట.
రైతన్నా.. అయితే నో.. నో..
నేటి రోజుల్లో అబ్బాయికి వివాహం నిశ్చయం కావాలంటే.. పెద్దల బదులు నేరుగా అమ్మాయే ప్రశ్నల వర్షం కురిపిస్తుందని కొందరు పెళ్లి కాని ప్రసాదుల వాదన. పూర్వం భూములు ఉంటే చాలు అనుకునే రోజుల్లో.. వ్యవసాయం చేసే యువ రైతన్నలకు వివాహాలు చిటికెలో జరిగేవి. కానీ కాలం మారింది. వ్యవసాయమా.. రైతన్నా.. వద్దు వద్దు.. కుదరదు.. మేము ఆ కష్టం చేయలేము మహాప్రభో.. వద్దంటూ నేటి అమ్మాయిలు రిజెక్ట్ చేసేస్తున్నారట.
నెలకు లక్షల్లో ఆదాయం ఉండాల్సిందే..
నేటి ఆధునిక కాలంలో అంతా డబ్బుమయమనే చెప్పవచ్చు. అందుకే కాబోలు నేటి అమ్మాయిలు.. తాము కళ్యాణం చేసుకొనే వరుడు నెలనెలా లక్షలు సంపాదించాలని ఆరాటపడుతున్నారు. నెలకు రూ. 50వేలు సంపాదించే యువకులను కూడా వివాహమాడేందుకు ముందుకు రాని అమ్మాయిలు ఉన్నారని యూత్ చెబుతున్నారు. అది కూడా గ్లామర్ లో మెరుపులు, చేతినిండా డబ్బు ఉంటే చాలు, గుణం తర్వాత అనే రీతిలో నేటి వివాహాలకు ముందడుగు పడుతుందట. అయితే అమ్మాయిల కోరికలు వింటున్న తల్లిదండ్రులు కూడా నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నా, లక్షలు సంపాదించే వరుడు కావాల్సిందే అంటూ లైన్ గీసేస్తున్నారట నేటితరం అమ్మాయిలు.
ఇప్పుడు కాకుంటే.. ఇంకెన్నాళ్లంటూ మోసపోతున్న యూత్
వయస్సు పైబడుతోంది. కానీ పెళ్లి ఘడియలు ఇంకా రాలేదు. ఎక్కడా కుదరని సంబంధాలతో విసిగిపోతున్న అబ్బాయిలు.. మ్యారేజ్ బ్యూరోల బాట పడుతున్నారు. కొందరు నిజాయితీగా వివాహాలను నిశ్చయిస్తుంటే, మరికొందరు ఇదే అదనుగా భావించి, మోసాలకు కూడా పాల్పడుతున్నారు. అంతేకాదు ఇటీవల అనంతపురం జిల్లాలో 50 ఏళ్ల పెళ్లి కాని వ్యక్తికి పెళ్లి సంబంధమంటూ.. ఓ పెళ్లిళ్ల బ్రోకర్ లక్షలు దండుకున్నాడట. అంతేకాదు సదరు మహిళ కూడా లక్షల్లో డబ్బులు తీసుకొని షాకిచ్చిందట.
మేమింతేనా అంటున్న ప్రసాదులు..
అమ్మాయిలూ.. ముందు మా గుణాలను చూడండి.. డబ్బులను కాదంటున్నారు ప్రసాదులు. లక్షలు సంపాదించే భర్త దొరికినా.. మీ సంసారంలో ఆనందం లేకుంటే మీకు జీవితాంతం కష్టాలే అంటూ హెచ్చరిస్తున్నారు అబ్బాయిలు. పాత రోజుల్లో కుటుంబ పెద్దల నిర్ణయాలకు విలువలు ఉండేవని, నేటి రోజుల్లో అలనాటి విలువలు లేకపోవడంతో తాము ఏళ్లకు ఏళ్లు పైబడుతున్నా.. పెళ్లి కాని ప్రసాదుల వలె ఉంటున్నట్లు యువకులు తెలుపుతున్నారు.
Also Read: Bigg Boss: ఆసక్తికరంగా మారిన ఏజ్ గ్యాప్.. గంగవ్వ కంటే నాగార్జునే పెద్దోడా..?
ఇది ఇలా ఉంటే కొందరు యువకులు, పెళ్లి పేరిట చేస్తున్న మోసాలు కూడా అమ్మాయిలకు భారీగా షాకిస్తున్నాయి. అబ్బాయిలు చేసే పని ఒకటి, చెప్పేది ఒకటి.. అందుకే అమ్మాయిలు ముందుగా అన్నీ నిర్ధారించుకున్నాకే పెళ్లికి ఓకే చెబుతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏదిఏమైనా పెళ్లి కానీ ప్రసాదులు పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాలలో అధికంగా ఉన్నారని ఓ లెక్క. పట్టణాల్లో కొంత మేరకు ప్రసాదులకు పెళ్లిళ్లు జరుగుతున్నా.. రైతన్నలు, చిన్నపాటి ప్రవేట్ జాబ్స్ చేసే యువకులకు మాత్రం.. పెళ్లికి నో.. నో.. అనే మాటలు వినిపిస్తున్నాయట అమ్మాయిల నోట. మరి కక్కు వచ్చినా, కళ్యాణ ఘడియలు వచ్చినా ఆగవుగా అంటూ పెళ్లి కాని ప్రసాదులు తమ మనసుకు అలా నొప్పించుకొని కాలం వెళ్లదీస్తున్నారట.