ఇంట్లో కుమారుడు ఉండి కూడా తన తల్లి మృతి చెంది వారం రోజులైనా గుర్తించలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ బీచ్రోడ్డు కురుపామ్ టవర్ రెండో అంతస్తులో ఇనగంటి శ్యామల (67) అనే వృద్ధురాలు తన కుమారుడు శరవణ్కుమార్(27)తో కలిసి నివాసముంటున్నారు. తన భర్త బాల సుబ్రహ్మణ్యం మృతి చెందడంతో ఇద్దరే ఉంటున్నారు.
జనవరి 1 నుంచి ఆ ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. ఆ ఇంటి నుండి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా.. ఆ వృద్ధురాలు సోఫాలో విగతజీవురాలై కనిపించింది. ఇల్లంతా దుర్వాసన వస్తుండటంతో.. వృద్ధురాలు మరణించిందని గుర్తించారు. ఇంట్లోనే ఉన్న కుమారుడిని పోలీసులు ప్రశ్నించగా.. తన తల్లి నిద్రపోతుందని సమాధానం చెప్పాడు.
శ్రవణ్ కుమార్ బీటెక్ చదువుకున్నాడు. అతను 2018 నుంచి 2020 వరకు బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఉద్యోగం మానేసి విశాఖలో తన తల్లితో కలిసి ఉంటున్నాడు.అతని మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో మరో ఉద్యోగానికి వెళ్లలేదు.
శ్రవణ్కుమార్ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే తన తల్లి చనిపోయిన విషయం గుర్తించలేదని పోలీసులు భావించారు. జనవరి 1న గుండెపోటుతో ఆమె మృతి చెంది ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. సి.ఐ. కోరాడ రామారావు ఆధ్వర్యంలో ఎస్సై సింహాచలం కేసు నమోదు చేసుకున్నారు.