Somireddy Chandra mohan reddy news(AP politics): మాజీ మంత్రి కాకాణిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. విభజన అంశాలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై కాకాణి విమర్శలు చేయగా చంద్రబాబుపై నోరు పారేసుకుంటే ఊరుకోం అని సోమిరెడ్డి హెచ్చరించారు. సోమవారం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసమే సీఎం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారని తెలిపారు.
ఒక్క అడుగు తగ్గి చంద్రబాబే హైదరాబాద్కు వెళ్లారని చెప్పారు. కేసుల కారణంగానే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా తేలేకపోయామని చెప్పారు. విభజన అంశం, సీఎంల సమావేశంపై కాకాణి విమర్శలు సరికావని హితవు పలికారు. అంతే కాకుండా మరోసారి చంద్రాబాబుపై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వ్యవసాయ మంత్రిగా కాకాణి ఆ రంగానికి ఏమీ చేయలేదని విమర్శించారు. మైక్రో ఇరిగేషన్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను కూడా ఖర్చు చేయలేకపోయారని అన్నారు.
జగన్ ఒక నియంత లాగా వ్యవహరించారని ఆరోపించారు. ఆయన హయాం కర్ఫ్యూని తలపించిందన్నారు. వైసీపీ పాలనలో తిరుమలను భ్రష్టు పట్టించారని తెలిపారు. అంతే కాకుండా ఆలయ పవిత్రతను పూర్తిగా దెబ్బతీసారని మండిపడ్డారు. బెంగుళూరు రేవ్ పార్టీలో కాకాణి కారు పాస్ దొరికిందన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రం డ్రగ్స్, గంజాయికి కేంద్రంగా మారిందని ఆరోపించారు.
విభజన అంశాలపై తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మాజీ మంత్రి కాకాణి విమర్శలు చేశారు. అసలు రేవంత్ రెడ్డితో చంద్రబాబు ఏం చర్చించారో చెప్పాలని అన్నారు. టీటీడీ ఆస్తులలో వాటా కోరింది నిజమా కాదా చెప్పాలని అన్నారు. రాష్ట్ర గౌరవాన్నిసీఎం తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి ఏపీకి వచ్చారని తెలిపారు. ఏపీకి చెందిన ఆస్తులను వదిలేసి ఎందుకు పారిపోయి వచ్చారని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలంగాణ సీఎంతో సమావేశమయ్యారని సోమిరెడ్డి అన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం చర్చలు నిర్వహించి వస్తే మంత్రి కాకాణి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
Also Read: ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!
తిరుమల దేవస్థానంలో వాటా కోరారు.. ఓడ రేవుల్లో భాగం అడిగారు. సముద్ర తీరంలో వాటా కావాలన్నారంటూ మాట్లాడుతున్నారని .. సీఎంలు నిర్వహించిన సమావేశ ప్రాంతంలోని టేబుల్ క్రింద కూర్చొని విన్నావా అంటూ ఎద్దేవా చేశారు. గడిచిన ఐదేళ్లలో ఓ సీఎం ప్యాలెస్, మరో సీఎం ఫామ్ హౌజ్ కు పరిమితం అయ్యారని అన్నారు. సీనియర్ నాయకుడైన చంద్రబాబు బాధ్యతలు చేపట్టి నెల గడవకముందే రాష్ట్ర ప్రయోజనాల కోసం శ్రమిస్తున్నారని తెలిపారు.