People Missing In Nallamala Forest: నల్లమల అడవులు ప్రపంచంలోని ఎక్కడాలేని చెట్లు, వన్య మృగాలు, పక్షులు, జంతువులు, పుణ్య క్షేత్రాలకు నిలయం. మన రాష్ట్రంలో ఐదు జిల్లాలమేర విస్తరించిన నల్లమల అడువులు ప్రాంతం.. అదే పేరుతో గల పర్వతం సానువులతో చక్కటి పర్యాటక ప్రదేశంగా అలరారుతోంది. మన రాష్ట్రంలో గుంటూరు, ప్రకాశం, రాయలసీమలోని కర్నూలు, కడప జిల్లాలకు విస్తరించి ఉన్న నల్లమల పర్వత శ్రేణి తూర్పు కనుమలలో ఒక భాగం.
వాగులు, వంకలు, ఆలయాలతో పర్యాటకులను ఆకర్షించే ఆ ప్రాంతంలో ఆకాశాన్ని తాకే చెట్లు.. పచ్చిక బయళ్లు కనిపిస్తాయి. గల గల పారే సెలయేటి సవ్వడులు.. పక్షుల కిలకిల రాగాలు వినిపిస్తాయి. ఇంతటి సుందర మనోహర దృశ్యాలకు నిలువైన ఆ ప్రాంతంలో పక్షుల కిలకిల రాగాలకు బదులు మనుషుల హాహాకారాలు వినుపిస్తున్నాయి. జలపాతాల సవ్వడుల స్థానంలో హెలికాప్టర్ చప్పుడులు వినుపిస్తున్నాయి. అసలు నల్లమల అడవుల్లో ఏం జరుగుతోంది. అక్కడ యువకులు ఎందుకు మిస్ అవుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో యువకులు కనిపించకుండా పోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
Also Read: కిక్కు తగ్గిందంటూ.. ఏపీలో మందుబాబుల కొత్త డిమాండ్స్.. ఆ హామీకై చేతులు జోడించేస్తున్నారు..
లెటెస్ట్గా శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న యాదయ్య అనే యువకుడు అటవీ ప్రాంతంలో కనిపించకుండా పోయాడు. అతని బైక్, ఫోన్, హెల్మెట్, బ్యాగ్ అటవీ ప్రాంతంలో దొరికాయి. ఈ ఘటన ఈ నెల 14న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే గత నెలలో కూడా ఓ యువకుడు ఇలానే నల్లమలలో కనిపించకుండా పోయాడు.
గత నెలలో లింగాల మండలం ఎర్రపెంటకు చెందిన శంకర్ అటవి ఉత్పత్తుల సేకరణకు వెళ్లి కనిపించకుండా పోయాడు. అతని ఆచూకీ కోసమే పోలీసులు గాలిస్తున్నారు. ఇంతలోనే మరో యువకుడు కనిపించకుండా పోయాడు. వీరిద్దరు కూడా ఆమ్రాబాద్ ఏరియాలోనే కనిపించకుండా పోయారు. ప్రస్తుతం స్థానికుల సాయంతో అడవిని జల్లెడ పడుతున్నారు పోలీసులు.