Tirupati : అంబులెన్స్ వస్తుంటే ఎవరైనా దారి ఇస్తారు. ట్రాఫిక్ పోలీసులు కూడా సహకరిస్తారు. ముఖ్యంగా చెక్పోస్టుల వంటి ప్రదేశాల్లోనూ పోలీసులు తనిఖీల పేరుతో పెద్దగా ఇబ్బందులు కలిగించరు. అంబులెన్స్లో అత్యవసరంగా హాస్పిటల్కు వెళ్లాల్సిన పేషంట్లు ఉంటారు కాబట్టి మానవత్వం చూపుతారు. కానీ.. ఇదే అవకాశంగా తీసుకున్న ఓ ముఠా ఎర్ర చందనం స్మగ్లింగ్కు అంబులెన్స్ను వాహనంగా ఎంచుకుంది.
తిరుపతి జిల్లా బాలపల్లి ఫారెస్ట్లో టాస్క్ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. అంబులెన్స్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న 10మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 25లక్షల విలువ చేసే 10 ఎర్ర చందనం దుంగలు, అంబులెన్స్ స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్టు తెలిపారు. నిందితుల ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు గుర్తించినట్టు డీఎస్పీ మురళీధర్రెడ్డి చెప్పారు.
అంబులెన్స్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేయడం ఈ ముఠాకు కొత్త కాదు. చాలా కాలం నుంచి ఇదే తరహాలో అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఈ ముఠా సభ్యులు చాలా పకడ్బంధీగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల కన్నుగప్పి స్మగ్లింగ్ చేస్తున్నారు. అంబులెన్స్లో రోగి, రోగి సహాయకులు, మెడికల్ సిబ్బంది.. అందరూ ముఠా సభ్యులే. ఒక్కొక్కరు ఒక్కో పాత్రలో నటిస్తారు. అర్జంట్గా హాస్పిటల్కు వెళ్లాలనే విధంగా పోలీసుల నుంచి సానుభూతి పొందుతారు. ఆరితేరిన నటుల్లాగా పోలీసులకు చిక్కకుండా చెక్పోస్టును దాటుతారు.
ఇప్పుడు కూడా పోలీసులకు దొరకకుండా స్మగ్లర్లు చాలా జాగ్రత్త పడ్డారు. కానీ.. పోలీసుల కదలికలు గమనించేందుకు.. ఓ నిందితుడు టూవీలర్పై అటూ ఇటూ తిరగడం పోలీసుల కంట పడింది. అతడిని పట్టుకుని ఆరా తీయగా.. స్మగ్లింగ్కు సిద్ధంగా ఉంచిన అంబులెన్స్ కథ బయటపడింది.