Kruthivennu Road Accident(Latest andhra news in telugu): కృష్ణాజిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 5 గంటలకు కృత్తివెన్ను మండలం సీతనపల్లికి సమీపంలోని హైవేపై రెండు లారీలు పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మరణించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుల్లో రెండు లారీల డ్రైవర్లతో పాటు మరో నలుగురు ఉన్నట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు లారీల్లో ఒకటి కృష్ణాజిల్లా బంటుమిల్లి వైపు వస్తుండగా.. మరొక లారీ పుదుచ్చేరి నుంచి భీమవరం వైపుగా వెళ్తుంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మృతుల్లో ఐదుగురు పశ్చిమగోదావరి జిల్లా తాళ్లరేవు వాసులుగా గుర్తించారు. బంటుమిల్లి వైపుగా వెళ్తున్న లారీలో డ్రైవర్ సహా 10 మంది ప్రయాణికులున్నట్లు తెలిపారు. మరొక లారీలో డ్రైవర్ తో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు.
ఈ రోడ్డుప్రమాదంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విచారం వ్యక్తం చేశారు. రోడ్డుప్రమాదంలో ఆరుగురు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే.. స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. గాయపడినవారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.