Viveka case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుగా ముందుకెళుతోంది. ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్రెడ్డికి తాజాగా తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. తనపై సీబీఐ తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. తదుపరి విచారణపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగించేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది. అలాగే విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణ ప్రాంతానికి న్యాయవాదిని అనుమతించలేమని స్పష్టం చేసింది.
వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ తన వాంగ్మూలాన్ని నమోదు చేసిందని అవినాష్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐను ఆదేశించాలని కోరుతూ వారం క్రితం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను విచారిస్తున్నప్పుడు ఆడియో, వీడియో రికార్డు చేయకపోవడాన్ని సవాలు చేశారు. జనవరి 28న, ఫిబ్రవరి 24న సీబీఐ సీఆర్పీసీ సెక్షన్ 161 కింద వాంగ్మూలం నమోదు చేసేటప్పుడు ఆడియో, వీడియో రికార్డు చేయాలని అభ్యర్థించినా చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.
తనను సీబీఐ విచారించేటప్పుడు తన న్యాయవాదిని కూడా అనుమతించాలని ఎంపీ అవినాష్ రెడ్డి హైకోర్టును కోరారు. తన వాంగ్మూల ప్రతులను ఇవ్వాలని దర్యాప్తు అధికారిని ఆదేశించాలన్నారు. తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఇప్పటివరకు రెండు అభియోగ పత్రాలను సీబీఐ దాఖలు చేసిందని తెలిపారు. వీటి ఆధారంగా వివేకా హత్యపై గంగిరెడ్డి చెప్పారంటూ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా తాను నేరంలో పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని అవినాష్రెడ్డి ఆ పిటిషన్లో స్పష్టంచేశారు. అయితే వాదనలు విన్న హైకోర్టు అవినాష్ రెడ్డి పిటిషన్ కొట్టివేసింది. అదే సమయంలో విచారణ చేస్తున్న సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని సీబీఐను హైకోర్టు ఆదేశించింది.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆయన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఈ కేసుపై ఉత్కంఠ రేగుతోంది. సీబీఐ నెక్ట్స్ స్టెప్ ఏంటి..? మరోసారి అవినాష్ రెడ్డిని విచారిస్తుందా..? అరెస్ట్ చేస్తుందా..?