Sharmila Joins Congress | రాజకీయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిస్థితులకు తగ్గట్లు మారుతుంటుంది. నేతలు కూడా అంతే. ఇప్పుడు వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానం కూడా కీలక దశకు చేరుకుంది. ఓవైపు పార్టీ విలీనం, ఇంకోవైపు జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించే దిశగా షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు.
Sharmila Joins Congress | రాజకీయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిస్థితులకు తగ్గట్లు మారుతుంటుంది. నేతలు కూడా అంతే. ఇప్పుడు వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానం కూడా కీలక దశకు చేరుకుంది. ఓవైపు పార్టీ విలీనం, ఇంకోవైపు జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించే దిశగా షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాజకీయాల్లో ఇదొక సాధారణ పరిణామమైతే కాదు.
ఇదీ వైఎస్ షర్మిల మాట. కాంగ్రెస్ లో చేరుతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా… ఇన్నాళ్లకు ఖర్గే, రాహుల్ సమక్షంలో సాధ్యమైంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారికంగా కాంగ్రెస్ లో విలీనమైంది. YSRTP పార్టీ పెట్టి కేసీఆర్ పై ఎడతెగని పోరాటం చేసిన షర్మిల.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో జాతీయ స్థాయిలో మరింత కీ రోల్ పోషించేందుకు సిద్ధమయ్యారు. తన అనుచరులు, వైఎస్ఆర్ టీపీ ముఖ్య నేతలతో కలిసి వెళ్లి ఢిల్లీ ఏఐసీసీ ఆఫీస్ లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత సోనియాగాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు.
కాంగ్రెస్ లో చేరుతూనే బీజేపీని టార్గెట్ చేశారు షర్మిల. దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్సేనని, అన్ని వర్గాలను కలుపుకుంటూ, అన్ని వర్గాలను కలుపుతూ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పనిచేస్తానన్నారు. వైఎస్సార్ అడుగు జాడల్లో నడుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నది తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల అని, దాన్ని నెరవేర్చే యత్నంలో తాను భాగస్వామిని అవుతున్నందుకు షర్మిల సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రతీ ఒక్కరి ఆకాంక్షలు నెరవేరుస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఓ క్రిస్టియన్ గా మణిపూర్ లో చర్చిల కూల్చివేత తనను తీవ్రంగా బాధించిందని వైఎస్ షర్మిల చెప్పడం.. కేంద్రంలో సెక్యులర్ పార్టీ అధికారంలో లేకపోతే ఏం జరుగుతుందోనన్న విషయాలు ప్రస్తావించడం ద్వారా కాంగ్రెస్ లో, అలాగే జాతీయ స్థాయి రాజకీయాల్లో తన రోల్ ఎలా ఉండబోతోందన్న విషయాలపై క్లారిటీ ఇచ్చినట్లయింది.
కాంగ్రెస్ తో మరో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన షర్మిల ఇప్పుడు ఆ పార్టీలో ఏ రోల్ అప్పగిస్తారన్నది కీలకంగా మారుతోంది. ఏఐసీసీలో కీలక పదవి ఉంటుందని చెబుతున్నారు. ఇంకోవైపు ఏపీలో పార్టీని గాడిన పెట్టే బాధ్యతలు తీసుకుంటారా.. ఏపీలో అసెంబ్లీకి పోటీ చేస్తారా.. లేదంటే లోక్ సభకు పోటీలో ఉంటారా అన్నది కీలకంగా మారింది. అది కూడా త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు. మరోవైపు కుటుంబాలను చీల్చి రాజకీయం చేయడం కొందరి నైజం అంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై షర్మిల రియాక్ట్ అయ్యారు. జగన్ ఏమన్నారో తనకు తెలియదని, ఏపీ కాంగ్రెస్ లో తన రోల్ ఏంటన్నది హైకమాండ్ డిసైడ్ చేస్తుందని చెప్పుకొచ్చారు.
ఏపీలో అన్న జగన్ తో పొసగకపోవడంతో షర్మిల రాజకీయ భవిష్యత్ రకరకాల మలుపులు తిరిగి చివరి కాంగ్రెస్ దగ్గరికి చేరుకుంది. నిజానికి జగన్ జైలులో ఉన్నప్పుడు ఏపీలో వైసీపీ ఉనికిని కాపాడడంలో షర్మిల కీ రోల్ పోషించారు. ఏపీలో పాదయాత్ర చేశారు. పార్టీని నమ్ముకున్న వైసీపీ కార్యకర్తలు, నేతలు చెల్లా చెదురు కాకుండా చూసుకున్నారు. జగన్ సీన్ లోకి వచ్చాక కుటుంబ రాజకీయ కథా చిత్రం మెల్లమెల్లగా మారుతూ వచ్చింది. ఇక 2019లో ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక.. షర్మిల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
మరోవైపు ఆస్తి పంపకాల విషయంలోనూ విబేధాలు వచ్చాయన్న టాక్ ఉంది. ఏపీలో ఇక అన్న జగన్ తో కుదరదని తెలిసి తెలంగాణకు షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ వైఎస్ఆర్ టీపీ పేరుతో పార్టీ పెట్టారు. పాదయాత్ర చేశారు. అయితే పరిస్థితులు అనుకూలించలేదు. చివరకు ఎన్నికల్లో అభ్యర్థులను పోటీ పెట్టకుండా కాంగ్రెస్ కు మద్దతు పలికారు. ఇప్పుడు ఏకంగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడే అసలు కథ మొదలైంది.