Sharmila Crucial Role | వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో ఏ రోల్ పోషించబోతున్నారు?… పార్టీలో ఏ బాధ్యతలు కట్టబెట్టినా మనస్ఫూర్తిగ పనిచేస్తానంటున్నారు షర్మిల . తనకు బాధ్యతలు అప్పగించే అంశంపై కాంగ్రెస్ అధిష్టాన నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయని, నేడోరేపో దానిపై స్పష్టత వస్తుందని అమె అంటున్నారు.
Sharmila Crucial Role | వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో ఏ రోల్ పోషించబోతున్నారు?… పార్టీలో ఏ బాధ్యతలు కట్టబెట్టినా మనస్ఫూర్తిగ పనిచేస్తానంటున్నారు షర్మిల . తనకు బాధ్యతలు అప్పగించే అంశంపై కాంగ్రెస్ అధిష్టాన నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయని, నేడోరేపో దానిపై స్పష్టత వస్తుందని అమె అంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అనామకంగా మారిపోయిన కాంగ్రెస్.. కనీసం ఉనికి చాటుకోవాలని తాపత్రయపడుతోంది. ఆ క్రమంలో క్రైస్తవ ఓటు బ్యాంకుపై కన్నేసిన కాంగ్రెస్ హైకమాండ్ .. సదరు ఓటర్లను ఆకట్టుకునే దిశగా జగన్ సోదరికి కీలక బాధ్యతలు కట్టబెట్టడం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు .
వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అప్పగించే బాధ్యతలపై ఉత్కంఠ నెలకొంది. పీసీసీ అధ్యక్ష పదవీ ఇస్తుందా.. లేదంటే ప్రచార కమిటీ బాధ్యతలను భుజాన వేస్తుందా? .. అదీకాకపోతే ఏఐసీసీలో ఏదైనా పదవి కట్టబెడుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల… అక్కడే ఉండి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ వంటి ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. వారికి తమ కుమారుడి వివాహ ఆహ్వానపత్రికను అందజేసి .. పార్టీపరంగా తాను నిర్వర్తించాల్సిన పాత్రపై వారితో సమాలోచనలు జరిపారంట.
ఏపీ రాజకీయ పరిస్థితులు, పార్టీలో పదవీ, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చేపట్టాల్సిన అంశాలపై ఖర్గే, వేణుగోపాల్తో చర్చించారని విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎంత అధోగతి పాలైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్పై రాష్ట్ర వాసులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే హస్తం పార్టీకి ఏపీలో కనీసం ఉనికి లేకుండా పోయింది… రానున్న ఎన్నికల్లో ఆ పరిస్థితిని చక్కదిద్దుకునే పనిలో పడింది కాంగ్రెస్ హైకమాండ్.
ఆ క్రమంలో ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన షర్మిలను కాంగ్రెస్లో చేర్చుకుని ఆమెకు కీలక బాధ్యతలు అప్పజెప్పే పనిలో పడింది. ఏపీలో బాధ్యతల స్వీకరణకు సంబంధించి నేడో రేపో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. పార్టీ తనకు ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని షర్మిల చెబుతున్నారు. తెలంగాణలో సొంత పార్టీని కాంగ్రెస్లో కలిపేసి.. ఏపీ పాలిటిక్స్లో ఎంటర్ అవుతున్న షర్మిలకు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కూడా ఆమెకు ఏ పదవీ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని చెబుతున్నారు .
షర్మిలకు ఏ బాధ్యతలు కట్టబెట్టినా. ఏపీలో గణనీయంగా ఓటు బ్యాంకును కొల్లగొట్టే బాధ్యతలను కూడా ఆమెకు అప్పజెప్పడమే కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు . ఎలాగూ జగన్ పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలు షర్మిల వెంట నడుస్తారన్న అభిప్రాయం ఉంది . దానికి తోడు జగన్ వెంట ఉన్న దివంగత వైఎస్ అభిమానుల్లో కూడా చీలిక వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం. వాటికి తోడు క్రైస్తవ ఓటు బ్యాంకుని ఆకట్టుకోవడమే కాంగ్రెస్ స్కెచ్ అంటున్నారు. ఆ బాధ్యత షర్మిల భుజాలపై పెడతారంటున్నారు .. ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ క్రైస్తవ మత ప్రచారకులు కావడంతో …ఆ వర్గం ఓట్లపై కాంగ్రెస్ పార్టీ కన్నేసిందట. దీంతోపాటు మణిపూర్లో చర్చిల కూల్చివేత అంశం గురించి షర్మిల బహిరంగంగా మాట్లాడారు. దీంతో కూడా ఆ కమ్యూనిటీ షర్మిలకు అనుకూలంగా మారే అవకాశం ఉందని కాంగ్రెస్ హైకమాండ్ లెక్కలు వేసుకుంటోందంట .