Seema garjana : కర్నూలు న్యాయ రాజధాని కోసం సీమ వాసులు కదం తొక్కారు. కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన రాయలసీమ గర్జన సభకు పోటెత్తారు. శ్రీబాగ్ ఒప్పంద ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సభలో ప్రజాప్రతినిధులు, మేధావులు, విద్యావేత్తలు, ప్రజా సంఘాల నాయకులు, వైఎస్సార్సీపీ నేతలు హాజరయ్యారు. ఈ సభలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, గుమ్మనూరు జయరాం, ఉషశ్రీచరణ్ పాల్గొన్నారు. నారాసుర భూతం పేరిట ఏర్పాటు చేసిన దిష్టిబొమ్మను దగ్థం చేశారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని నినాదాలు చేశారు.
టార్గెట్ చంద్రబాబు
వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. వికేంద్రీకరణను వ్యతిరేకించే పార్టీలకు బుద్ధి చెప్పేందుకు రాయలసీమ గర్జన ఏర్పాటు చేశామన్నారు. చంద్రబాబు కుప్పంలో ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారని ఆరోపించారు. కుప్పాన్ని అన్ని విధాలా సీఎం జగన్ అభివృద్ధి చేశారన్నారు.
వికేంద్రకరణ కోసమే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని స్పష్టంచేశారు. స్వప్రయోజనాలకోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారని మండిపడ్డారు.
రాయలసీమ వాసులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని మంత్రి ఉషశ్రీ చరణ్ విమర్శించారు.
వికేంద్రీకరణతో టీడీపీకి మనుగడ ఉండదని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు.
శ్రీబాగ్ ఒప్పందం మేరకు 1937లో కాశీనాథుని నాగేశ్వరరావు ఇంట్లో జరిగిన పెద్దమనుషులు ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సీమవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆరు దశాబ్దాలుగా ఇచ్చిన మాటను నెరవేర్చడాన్ని పాలకులు నిర్లక్ష్యం చేసినా.. 2020లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల అభీష్టం మేరకు జీఎన్ రావు కమిటీ నివేదిక ఆధారంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని వైఎస్ఆర్ నేతలు అంటున్నారు. ఈ మొత్తం మీద రాయల సీమ గర్జన సభలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ నేతలు మాట్లాడారు.