Political news in AP: అనుకున్నట్టే అయింది. సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్గా సీనియర్ మోస్ట్ లీడర్ కన్నా లక్ష్మీనారాయణను నియమించారు అధినేత. వచ్చే ఎన్నికల్లో మంత్రి అంబటి రాంబాబుపై కన్నాను ప్రయోగించబోతున్నారు చంద్రబాబు. అంబటి అన్నట్టుగా.. సత్తెనపల్లికి వస్తున్న కొత్త వస్తాదు.. కన్నా లక్ష్మీనారాయణేనని తేలిపోయింది.
దాదాపు నాలుగేళ్లు నానబెట్టారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి టీడీపీ తరఫున ఇంఛార్జే లేరు. అటువైపు బలమైన అంబటి రాంబాబు ఉన్నారు. ఆయన్ను ఎలాగైనా ఈసారి ఓడించాలని చంద్రబాబు గట్టిగా అనుకుంటున్నారు. ఈ విషయం అంబటి సైతం చెప్పారు. తనను, కొడాలి నానిని, రోజాను ఓడించాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారని చెప్పారు. ఆయన చెప్పినట్టే.. అంబటి రాంబాబుపై కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు, నాగమల్లేశ్వరరావులను కాకుండా.. కన్నాను నిలబెట్టనున్నారని తేలిపోయింది.
ఇటీవలే BJP నుంచి TDPలో చేరారు కన్నా లక్ష్మీనారాయణ. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు పలుమార్లు మంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా.. జిల్లాలో బలమైన నాయకుడు. ఆర్థిక, అంగ బలం మెండు. అందుకే, అంబటిపై పోటీకి.. ఏరికోరి మరీ కన్నాను ఎంచుకొని.. సత్తెనపల్లి పార్టీ బాధ్యతలు అప్పగించడంతో రాజకీయం రంజుగా మారింది. రాంబాబుకు గట్టి సవాలే ఎదురైంది.
సత్తెనపల్లి టీడీపీలో అసలేం జరుగుతోంది..
సత్తెనపల్లి. ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిథ్యం వహించిన ఈ నియోజకవర్గంలో టీడీపీకి గట్టి పట్టుంది. కానీ.. గత ఎన్నికల్లో జగన్ వేవ్తో ఇక్కడ టీడీపీ ఓటమి పాలైంది. ఐతే.. ఈసారి ఇక్కడ నుంచి టీడీపీ తరపున టికెట్ ఆశించేవారు పెరిగారు. కోడెల కుమారుడు శివరాం.. గతంలో సత్తెనపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన వైవీ ఆంజనేయులు.. పార్టీయే సర్వస్వం.. పార్టీకే జీవితం అంకితం అంటున్న నాగమల్లేశ్వరరావులతో పాటు కన్నా సైతం సత్తెనపల్లి సీటుపై కన్నేశారు. నాలుగేళ్లుగా టీడీపీ అధిష్టానం ఇక్కడ ఇన్చార్జ్ని నియమించకపోవడంతో.. నేనంటే, నేనంటూ ఒకరికి నలుగురు పోటీపడ్డారు. ఐతే.. ఎవరికి వారు ప్రయత్నం చేస్తే తప్పు లేదు.. కానీ క్యాడర్ను మూడు వర్గాలుగా చేసుకొని ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ పార్టీ పరువును బజారున పడేశారు.
సత్తెనపల్లిలో అన్నా క్యాంటీన్లను కూడా ఎవరికి వారు ఏర్పాటు చేశారు. బస్టాండ్ సెంటర్లో కోడెల శివరాం, పార్టీ కార్యాలయం సమీపంలో వైవీ ఆంజనేయులు ప్రారంభించారు. అయితే అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ సమయంలో గొడవ పడడం.. అన్నా క్యాంటీన్ ఏర్పాటును తెలియచేస్తూ ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను సైతం ఒకరివి మరొకరు చించి వేయడంపై అధిష్టానం సీరియస్ అయింది. దీంతో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను తప్పనిసరిగా కార్యాలయంలో నిర్వహించాలని ఆదేశించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ కోడెల శివరాం పార్టీ ఆఫీస్లో కార్యక్రమం నిర్వహించేందుకు వెళ్లగా వైవీ వర్గం అడ్డుకుంది. ఈ సందర్భంగా రెండు గ్రూపులు కుర్చీలతో దాడి చేసుకొని కలకలం రేపాయి.
ఇలా.. సత్తెనపల్లిలో గ్రూప్ వార్ నడుస్తున్న సమయంలో.. ఇక ఆలస్యం చేస్తే పార్టీకి మరింత డ్యామేజ్ జరుగుతుందని భావించిన చంద్రబాబు.. టీడీపీ ఇంఛార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణను నియమించడం ఆసక్తికరం. అయితే, మిగతా నాయకులు కన్నాకు సహకరిస్తారా? కలిసికట్టుగా పని చేస్తారా? అంబటిని ఓడిస్తారా? టీడీపీలో గొడవలు.. అంబటికే కలిసొస్తాయా? చూడాలి ఏం జరుగుతుందో.