Avinash Reddy : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వచ్చిన ఆయన్ను అధికారులు సుదీర్ఘంగా.. ఏడు గంటల పాటు విచారించారు. ప్రతి శనివారం.. సీబీఐ విచారణకు హాజరుకావాలని.. హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. వైఎస్ వివేకా హత్య కేసు గురించి సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హత్య వెనుక కుట్రకోణం, ఆర్థిక లావాదేవీలు, వాట్సాప్ కాల్ డేటా ప్రకారం.. సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తోంది.
అడిషనల్ ఎస్పీ స్థాయిలో అధికారి సమక్షంలో అవినాష్రెడ్డి విచారణ కొనసాగింది. విచారణ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేస్తున్నారు సీబీఐ అధికారులు. ముందస్తు బెయిల్ పొందాక నాలుగోసారి విచారణకు హాజరయ్యారు అవినాష్. అవినాష్రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. అయితే జూన్ నెల చివరి వరకు ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరుకావాలని అవినాష్ను హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన సీబీఐ విచారణకు హాజరయ్యారు. అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేయడంతో.. అవినాష్ రెడ్డికి అరెస్ట్ టెన్షన్ లేకపోయింది.
అయితే వివేకా హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు. గత నెలలో విచారణకు రావాల్సిందిగా సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయగా.. పలు నాటకీయ పరిణామాలు జరిగాయి. మరోవైపు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టి.. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అవినాశ్ తల్లి అనారోగ్యం దృష్ట్యా ఇటీవల తెలంగాణ హైకోర్టు మే 31 వరకూ అవినాశ్ను అరెస్ట్ చేయొద్దని సీబీఐని గతంలో ఆదేశించింది. ఆ తర్వాత ముందస్తు బెయిల్ రూపంలో అవినాష్కు భారీ ఊరట లభించింది.