Sajjala angry on AP Exit poll: తమ పాలనపై నాయకులకు నమ్మకం పోయింది. అందుకే ఎన్నికల వచ్చేసరికి సర్వే, ఎగ్జిట్పోల్స్పై పార్టీలు ఆధారపడుతున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా వస్తే, తమ పాలన బాగుందని డబ్బా కొడతారు. ఒకవేళ నెగిటివ్గా వస్తే చిందులేస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ పరిస్థితి కూడా అంతే.
స్థానికంగా ఉండే కొన్ని సంస్థలు ఎగ్జిట్పోల్స్ వైసీపీ కంటే టీడీపీకే ఎక్కువ ఇచ్చాయి. అటు నేషనల్ మీడియా అయితే ఒకటి రెండు తప్పితే అంతా ఏపీలోని కూటమి విజయం ఖాయమని వెల్లడించాయి. ఇదిలావుండగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. ఇందులో ఎన్డీయే 100 నుంచి 120 సీట్లు రావచ్చన్నది అంచనా. అదే సమయంలో అధికార వైసీపీకి 55 నుంచి 77 మధ్య రావచ్చని పేర్కొంది.
అంతేకాదు ఏఏ వర్గాలు ఎవరెవరికి సపోర్టు చేసిందనే దానిపై క్లారిటీ ఇచ్చింది ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా. కూటమికి పురుషులు 54 శాతం, మహిళలు 48 శాతం మద్దతు పలికారన్నది అందులోని సారాంశం. ఇక అధికార వైసీపీకి పురుషులు 41శాతం, మహిళలు 47శాతం అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. గత ఎన్నికలతో పోల్చితే పురుషులు 10శాతం, మహిళలు రెండు శాతం ఆ పార్టీ కోల్పోయే అవకాశముందని చెప్పకనే చెప్పింది.
యువత, విద్యావంతులు, పట్టణవాసుల్లో అధికశాతం కూటమి వైపు మొగ్గు చూపినట్టు ప్రస్తావించింది ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా. ఇందుకు కారణాలను విశ్లేషించారు. ముఖ్యంగా ఏపీపై అప్పులభారం, అభివృద్ధి శూన్యం, నిత్యావసరాల ధరలు పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రభావం చూపాయన్నది అందులోని లోగుట్టు. ఇక అభ్యర్థులను ఒక చోట కాకుండా మరోచోట నుంచి బరిలోకి దింపడం కూడా మరో కారణంగా పేర్కొంది. దీనికితోడు చంద్రబాబును జైలుకు పంపడం, టీడీపీ-జనసేన-బీజేపీ కలవడం కూడా కూటమికి కలిసొచ్చే అంశంగా పేర్కొంది. 2019 ఎన్నికల్లో ఇండియాటుడే ఎగ్జిట్పోల్స్ వైసీపీ అనుకూలంగా ఇచ్చిన విషయం తెల్సిందే.
ALSO READ: రివాల్వర్తో బెదిరించారు: గులకరాయి కేసు నిందితుడు సతీష్
ఇండియా టుడే ఎగ్జిట్పోల్స్పై వైసీపీ రియాక్ట్ అయ్యింది. వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. కేవలం తమ పార్టీకి రెండు ఎంపీ సీట్లు ఇచ్చిందని, దయతో ఇచ్చా రేమో అర్థం కావడంలేదన్నారు. పాలన సరిగా చేసివుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నది మరి కొందరిమాట. పైకి గట్టిగా మాట్లాడుతున్నా వైసీపీ నేతలకు ఎక్కడో డౌట్ మాత్రం వెంటాడుతోంది. ఎందుకంటే టీడీపీ పొత్తు పెట్టుకున్న ప్రతీసారి ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈసారి అటువైపు సంకేతాలు కనిపిస్తున్నాయన్నది అంతర్గతంగా నేతలు చర్చించుకోవడం కొసమెరుపు.