Sajjala Ramakrishna reddy: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తుఫాన్ పై కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడాన్ని తప్పుపట్టారు. తుపాను బాధితులకు ఏం సహాయం చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఈ లేఖ రాయడానికి చంద్రబాబుకి తలకాయ ఉందా? అని సజ్జల నిలదీశారు. తుపాను పరిహారం విషయంలో తప్పు పట్టడానికి అవకాశం లేకుండా ప్రభుత్వం బాధితులను ఆదుకుందన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బాధ్యత లేకుండా మాట్లాడితే ఎలా? అని చంద్రబాబును ప్రశ్నించారు.
“వైసీపీ ప్రభుత్వం 31 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చింది. సంక్షేమ పథకాలను ప్రజలు తమ హక్కుగా వినియోగించుకుంటున్నారు. కోటీ 47 లక్షల కుటుంబాలకు నేరుగా సంక్షేమం అందుతోంది. టీడీపీ ప్రభుత్వంలో ఏం చేశారో ఒక్కటైనా చెప్పగలరా?. ఉద్ధానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాం. 2014-19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు ఉద్ధానానికి ఏం చేశారు. ఉద్ధానం కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశారు. చంద్రబాబు ఎవరికి కథలు చెబుతారు” అంటూ సజ్జల మండిపడ్డారు.
‘‘చంద్రబాబును చూస్తుంటే సినిమాలో క్షుద్రపూజలు గుర్తొస్తున్నాయి. గతంలో దుర్గగుడిలో పూజలు చేసినట్లు ఇప్పుడు కూడా పూజలేమైనా చేస్తున్నాడు అనుకుంటా. అభ్యర్థులు మార్పు విషయంలో అవాకులు చవాకులు పేలుతున్నారు. బీసీ సీట్లలో నువ్వు,నీకొడుకు ఎందుకు పోటీ చేస్తున్నారు. చంద్రగిరి వదిలేసి కుప్పంలో ఎందుకు పోటీ చేస్తున్నారు?. 2024లో చంద్రబాబుకు కుప్పంతో సహా ఒక్క సీటు కూడా రాదు. అత్యంత పారదర్శకంగా జరుగుతున్న జగన్ మోహన్ రెడ్డి పాలనపై బురద జల్లుతున్నారు. చంద్రబాబు తప్పిదాలను మాకు ఆపాదించి రోజూ పనికిమాలిన రాతలు రాస్తున్నారు. కౌంటర్లు పెట్టి తెలంగాణలో వారిని తీసుకొచ్చి ఓట్లను రిజిస్టర్ చేయిస్తున్నారు. సిటిజన్ ఫోరమ్ పేరుతో ఒక బోగస్ ఫోరమ్ను పెట్టారు’’ అని సజ్జల మండిపడ్డారు.