Chandrababu: ఏపీలో అధికారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. జగన్ సర్కారు దాడిని తట్టుకుంటూ.. బలంగా పోరాడుతున్నారు. జనసేన, బీజేపీతో జట్టుకట్టైనా సరే.. ఈసారి జగన్ ను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. అలాంటిది, సడెన్ గా తెలంగాణపై చంద్రబాబు ఫోకస్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. అనూహ్యంగా ఖమ్మంలో టీడీపీ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించి.. సత్తా చాటారు. చంద్రబాబు ఖమ్మం సభపై వైసీపీ సెటైర్లు వేస్తోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల.. హాట్ కామెంట్స్ చేశారు.
ఇప్పటికీ చంద్రబాబుది రెండు కళ్ల సిద్దాంతమే అన్నారు సజ్జల. ఎన్నికలు వస్తున్నాయనే ఆయన తెలంగాణ వెళ్లారని.. చంద్రబాబు అసలు ఏ రాష్ట్రంలో ఉన్నారో అర్థం కావట్లేదన్నారు. రాజకీయంగా ఏదో ఒక ప్రయోగం చేసి చంద్రబాబు తనకు తానే డిమాండ్ క్రియేట్ చేసుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో బీజేపీతో పొత్తు కోసమే చంద్రబాబు ఖమ్మం సభతో బల ప్రదర్శన చేశారని సజ్జల అన్నారు.
గతంలో రాహుల్ గాంధీతో చంద్రబాబు జత కట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లోని స్లీపర్ సెల్స్ ను బయటకు రావాలని పిలుస్తున్నారని.. ఏపీ బీజేపీలోని స్లీపర్ సెల్స్ ను మాత్రం పిలవడం లేదని సజ్జల మండిపడ్డారు.