Sajjala : ఎప్పుడూ ఏపీ సీఎం జగన్ పై నేరుగా విమర్శలు చేసే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. సకల శాఖల మంత్రి సజ్జల అని సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సజ్జల కూడా జనసేనానిపై అదే రేంజ్ లో కౌంటర్లు వేశారు. తనపై పవన్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనను టార్గెట్గా చేసుకుని ప్రజల్లో ఏదో క్రియేట్ చేయడానికి ఇలా చేస్తున్నారన్నారు. గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా పవన్ రిమోట్ చంద్రబాబు చేతుల్లోనే ఉంటుందన్నారు.
సీఎం అభ్యర్థి ఎవరనేది ముందు క్లారిటీ ఇవ్వాలని పవన్ ను సూటిగా ప్రశ్నించారు సజ్జల. లోకేష్, పవన్, చంద్రబాబుల్లో సీఎం అభ్యర్థి ఎవరో ప్రజలకు చెప్పాలన్నారు. టీడీపీ, జనసేన విడివిడిగా పోటీకి వచ్చినా కలిసొచ్చిన తామే సిద్ధమేనని స్పష్టం చేశారు. పొత్తుల గురించి పవన్ చెప్పిన 3 ఆప్షన్లు చూస్తే నవ్వొస్తోందన్నారు. ఏమీ లేకుండా చంద్రబాబుకి సపోర్టు చేయడం అనే నాలుగో ఆప్షన్ కూడా చెప్పాల్సింది అంటూ పవన్ పై సజ్జల సెటైర్లు వేశారు.
ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలపై సజ్జల స్పందించారు. ఆ నిధులు దుర్వినియోగంపై పవన్ వద్ద ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. చంద్రబాబు రిమోట్ నొక్కితే పవన్ మాట్లాడతారని విమర్శించారు. గెస్ట్ ఆర్టిస్ట్లా వచ్చి టీడీపీ స్క్రిప్ట్ చదివి వెళ్తారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు సబ్ప్లాన్ కంటే ఎక్కువగా నిధులు అందిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో రూ.33 వేల కోట్లు ఖర్చు చేశారని.. అదే జగన్ మూడేళ్లలో రూ. 48 వేల కోట్లు నిధులు ఇచ్చారని వెల్లడించారు. రాజకీయంగా ఎస్సీ, ఎస్టీలకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.
లోకేష్ పాదయాత్రను టీడీపీ ఎక్కువగా ఊహించుకుంటోందని సజ్జల విమర్శించారు. జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఉన్న నిబంధనలే ఇప్పుడు ఉన్నాయని తెలిపారు. జగన్ ఆంక్షలకు లోబడే పాదయాత్ర చేశారని.. ఆంక్షలు పెట్టారని గగ్గోలు పెట్టలేదన్నారు. కందుకూరు, గుంటూరు ఘటనల నేపథ్యంలో రోడ్లపై సభలు నిషేధించాలని నిర్ణయం తీసుకున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.