Road Accident : ప్రకాశం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. దర్శి సమీపంలో సాగర్ కాల్వలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. 18 మందికి గాయాలయ్యాయి. ఈ బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద జరిగిన సమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నారు.
పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పొదిలికి చెందిన ఓ కుటుంబం వివాహ రిసెప్షన్ కోసం కాకినాడ వెళ్లేందుకు ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనలో అబ్దుల్ అజీజ్(65), ముల్లా జానీబేగం(65), అబ్దుల్ హాని(60), ముల్లా నూర్జహాన్ (58), షేక్ రమీజా (48),షేక్ షబీనా(35),షేక్ హీనా(6) ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు క్షతగాత్రులను ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. మృతురాలు షేక్ రమీజా భర్త చెన్నైలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కాకినాడకు రైలులో వెళ్లారు. దీంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ప్రమాదస్థలిని ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్ పరిశీలించారు. దర్శిలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.