చిన్నారి లక్షితపై చిరుత దాడి తర్వాత టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. నడక దారిలో ఇకపై చిన్నారులను తీసుకెళ్లడంపై ఆంక్షలు విధించింది. ఆరేళ్ల చిన్నారి లక్షితపై అత్యంత దారుణంగా చిరుత దాడి చేసి చంపిన తర్వాత టీటీడీ అధికారులు కొత్త ఆంక్షలను విధించారు. తిరుమలకు నడక మార్గాల్లో వచ్చే చిన్నారుల భద్రతపై దృష్టి సారించారు.
ఇకపై నడక మార్గాల్లో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే చిన్నారులకు అనుమతి ఇస్తామని ప్రకటించారు. అలిపిరి నడకమార్గం, శ్రీవారి మెట్లమార్గంలో ఈ ఆంక్షలను అమలు చేస్తామని తెలిపారు. సోమవారం నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి నిరాకరిస్తామన్నారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే చిన్నారులను పూర్తి స్థాయిలో నడకమార్గంలో అనుమతిస్తామని తెలిపారు.
ఏడో మైలు వద్ద చిన్నారుల చేతికి ట్యాగులు వేస్తున్నారు. చిన్న పిల్లలు తప్పిపోయినా, అనుకోని ఘటనలు జరిగినా వారిని గుర్తించేందుకు ఈ ట్యాగులు ఉపయోగపడతాయని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ ట్యాగ్స్ పై పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్ నమోదు చేస్తున్నారు. అలిపిరి–తిరుమల మార్గంలో వంద మంది భక్తులను గుంపుగా పంపుతున్నారు. ముందు , వెనుక రోప్ ఏర్పాటు చేసి సెక్యూరిటీ గార్డులను వారికి రక్షణగా పంపుతున్నారు. అదే సమయంలో రెండో ఘాట్ రోడ్డులో సాయంత్రం ఆరు గంటల తర్వాత బైక్లకు నో ఎంట్రీ అని స్పష్టం చేశారు.
మరోవైపు చిన్నారిపై దాడి చేసిన చిరుతను బంధించేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ చిరుత పట్టుకోవడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 3 చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. చిరుతల సంచారంపై నిఘా పెట్టారు. ఇందుకోసం టీమ్లను ఏర్పాటు చేశారు. నడకమార్గం పరిధిలో 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.