AP: విజయవాడలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వేడుకలకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు పుష్ఫగుచ్ఛంతో సీఎం జగన్ స్వాగతం పలికారు.
అనంతరం జాతీయ పతాకాన్ని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆ తర్వాత పోలీసుల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు భేష్ అని గవర్నర్ ప్రశంసించారు. అమ్మఒడి, నవరత్నాలు, జగనన్న గోరుముద్ధ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని తెలిపారు. నాడు నేడు పథకం కింద పాఠశాలలను అభివృద్ధి చేస్తోందని… జగనన్న విద్యాకానుక ద్వారా పుస్తకాలు, దుస్తులు, స్కూల్ కిట్ అందిస్తోందని వెల్లడించారు.
రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అండగా ఉంటున్నామన్నారు. పండించిన పంటకు మద్ధతు ధర కల్పిస్తున్నామని వెల్లడించారు. రైతు కుటుంబాలకు ప్రతి యేటా 13,500 సాయం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 37 లక్షల మంది రైతులకు పంటల బీమాను అమలు చేశామని చెప్పారు.