AP Elections 2024: మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హింసాత్మక ఘటనపై ఈసీ సీరియస్ అయ్యింది.ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాల ఎస్పీలను వివరణ కోరింది. దీంతో ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డిలు సీఈఓ ముకేశ్ కుమార్ మీనా ఎదుట గురువారం హాజరయ్యారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నాసరే.. రాష్ట్రంలోని గిద్దలూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో రాజకీయ హత్యలు జరిగాయి. మాచర్ల నియోజకవర్గంలో ఓ వాహనాన్ని తగలహబెట్టారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ఎస్పీలను ఏపీ సీఈఓ వివరణ కోరారు. వారితో విడివిడిగా ఆ అంశాలపై చర్చించారు.ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా పోలీసులు శాంతి భద్రతల విషయంలో నిర్లక్ష్యంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మూడు జిల్లాల ఎస్పీలు సీఈఓ మీనా కుమార్ కు వివరణలు ఇవ్వగా.. ఆన వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వారిపై చర్యలు తీసుకోనున్నారు.
Also Read: Drugs Bust in Vizag: విశాఖపట్నంలో డ్రగ్స్ కలకలం.. 25 వేల కేజీల కొకైన్ సీజ్..
ఈ సమావేశంలో ఆ జిల్లాల ఎస్పీలను శాంతి భద్రతల విషయంలో నిర్ణక్ష్యంగా వ్యవహరించడంపై ఆయన ప్రశ్నించారు. రాజకీయ హత్యలు జరిగే దాక పరిస్థితులు దిగజారే వరకు ఎందుకు వేచి చూడాల్సి వచ్చిందని ప్రశ్నించారు.మాచర్ల వంటి సున్నితమైన నియోజకవర్గంలో కూడా ఇలాంటి ఘటన జరగడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఈసీ ప్రత్యేక నిఘా పెట్టిందని సీఈఓ మీనా కుమార్ వెల్లడించారు.