Krishna Delta : ఖరీఫ్ సీజన్లో నెలముందుగానే కృష్ణా డెల్టాకు ఏపీ ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా ఈస్ట్రన్ హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీటిని మంత్రి అంటి రాంబాబు విడుదల చేశారు. కృష్ణమ్మకు ప్రజాప్రతినిధులు, అధికారులు పూజలు నిర్వహించారు. పూలు, పళ్లు, గాజులు, పసుపు, కుంకుమ, సారెను సమర్పించారు. వెయ్యి క్యూసెక్కుల నీటిని తొలుత విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, దూలం నాగేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పాల్గొన్నారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల కాలువలకు గతంలో జూన్ నెలాఖరులో లేదా జూలై మొదటి వారంలో నీరు వదిలేవారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సీఎం జగన్ ఆదేశాలతో నెల ముందే నీటిని విడుదల చేశామన్నారు. త్వరగా ఖరీఫ్ ప్రారంభమైతే 3 పంటలు పండే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రకృతి విపత్తుల నుంచి రైతుకు ఇబ్బంది ఉండదన్నారు. పులిచింతల ప్రాజెక్టులో 34 టీఎంసీల నీరు నిల్వ ఉందని వెల్లడించారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీరు తెచ్చే అవసరం లేదని మంత్రి తెలిపారు. వైఎస్ఆర్, జగన్ పాలనలో వర్షాలు బాగా పడతాయని రుజువైందని చెప్పారు.
రైతుల మేలు కోసం నెల రోజుల ముందే నీరు విడుదల చేశామని మంత్రి జోగి రమేష్ అన్నారు. సీఎం జగన్ నాలుగేళ్ల పాలనలో దేవుడు కరుణించాడని చెప్పారు. వరుణ దేవుడి కరుణా కటాక్షాలతో జలాశయాలు నిండు కుండలా మారాయన్నారు. రైతులకు పంటలు బాగా పండి మంచి దిగుబడి వచ్చిందని తెలిపారు. వైఎస్ హయాంలో పులిచింతల పనులు పూర్తి చేశారని తెలిపారు. ఏపీ అన్నపూర్ణగా పంటలతో కళకళలాడుతోందన్నారు.