Kurnool MP Sanjeev Kumar : వచ్చే ఎన్నికల్లో విజయం కోసం వైసీపీ చేస్తున్న మార్పులతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. అభ్యర్ధులను మారుస్తూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ పార్టీలో రాజీనామాల పర్వానికి తెర లెగిసింది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఆ జాబితాలో ఎంపీలు కూడా చేరిపోతున్నారు. తాజాగా కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీలో బీసీలకు పదవులే తప్ప పవర్ లేదని తాను ఎంపీగా గెలిచాక రెండు సార్లు మాత్రమే సీఎంని కలవగలిగానని పార్టీలో రెడ్డి వర్గం వారికే అన్ని పనులు అవుతున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి.
కర్నూల్ ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ 2019 ఎన్నికల ముందు వరకు పొలిటికల్ సర్కిల్స్లో పెద్దగా పరిచయం లేని పేరు. బీసీ వర్గానికి చెందిన ఆ డాక్టర్ ఓవర్నైట్ వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా ఫోకస్ అయి అదే ఊపులో విజయం సాధించారు. ఎంపీగా విజయం సాధించాక కర్నూల్ నగరంలో స్థానికంగా నివాసం ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే పెద్దగా రాజకీయ అనుభవం లేని ఆయన పార్టీ నాయకులను కలుపుకుని పోవడంలో ఫెయిల్ అయ్యారన్న టాక్ ఉంది.
గతంలో జరిగిన ఎన్నికలలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫ్యాను గాలి జోరుగా వీచింది. తమకు పెద్దగా పరిచయం లేనప్పటికీ కొందరు ఎమ్మెల్యే అభ్యర్ధులతో పాటు కర్నూలు ఎంపీగా కొత్త ముఖమైన సంజీవ్కుమార్ లాంటి వారిని జిల్లా వాసులు గెలిపించారు. కర్నూలు ఎంపీగా సంజీవ్ కుమార్ ఎన్నికైనప్పటి నుంచిపార్టీ క్యాడర్తో, జిల్లాలో ముఖ్య నాయకులతో కూడా ఎక్కువగా కలిసే వారు కాదంటారు. వివిధ సందర్బాల్లో సంజీవ్కుమార్ తాను ఫుల్ టైం రాజకీయ నాయకుడ్ని కాదని కేవలం పార్ట్ టైం పొలిటీషియన్ మాత్రమే అని ఫ్యూచర్లో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ప్రకటనలు చేశారు.
కర్నూలు ఎంపీగా ఆయన పదవీ కాలం రెండు సంవత్సరాలు పూర్తైన తరుణంలో పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలను, ఎంపీలను గడపగడపకు తిరగాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే సంజీవ్ కుమార్ ఏమాత్రం కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో గడప గడపకు తిరగడంపై ఆసక్తి చూపించలేదు. దాంతో అధిష్టానం సీరియస్ అయి ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అదే సమయంలో కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని పరిసర ప్రాంతాలలో అత్యధికంగా ఉన్న చేనేత వర్గీయుల్లో అదే వర్గానికి చెందిన ఎంపీ సంజీవ్ కుమార్పై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో వెల్లడైందంట.
ఆ అంశాలన్ని తెలిసో ఏమో ? కర్నూలు ఎంపీ స్థానం నుంచి తనను తప్పిస్తే ఎమ్మెల్యే టికెట్ అయినా ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారంట సంజీవ్కుమార్. ఎమ్మిగనూరులో తమ సామాజిక వర్గం తనను సపోర్టు చేస్తుందని ఎలాగైనా తాము గెలుస్తానని ఆయన పార్టీ అధిష్టానానికి చెప్పినా ఇప్పటివరకు ఎలాంటి హామీ లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారంట. అయినా ఏదో ఒక టికెట్ లభిస్తుందన్న ఆశతో ఇంతకాలం ఉన్న ఆయన ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇక ఛాన్స్ లభించదని పార్టీలో ఉండటం కష్టమని ఫిక్స్ అయ్యారట.
తన రాజకీయ భవితవ్యంపై తాడేపల్లికి ఫోన్ చేసినా ఎవరూ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోతుండటంతో ఇలాంటి పార్టీలో తాను ఇవ్వడలేనన్న ఆగ్రహంతో ఆయన కర్నూల్ ఎంపీ పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారంటున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై తన సామాజిక వర్గం వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటానంటున్నారు. రానున్న ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా నైనా పోటీ చేస్తానని. తన వర్గం వారు మద్దతుగా ఉంటారని ధీమాతో ముందుకెళ్తున్నారట.
ఆ క్రమంలోనే ఇప్పుడాయన వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీసీలకు పార్టీలో పదవులే తప్ప పవర్ లేదని. ప్రభుత్వ పరంగా రెడ్డి వర్గం వారికైతే అన్ని పనులూ అవుతున్నాయని ఆరోపణలు చేశారు.పేరుకి ఎంపీని అయినప్పటికీ ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే తనకు సీఎం అపాయింట్మెంట్ లభించిందని ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. ఎంపీగా కేంద్రంతో మాట్లాడి చేయగలిగినంత తన నియోజకవర్గానికి చేశానని పూర్తి స్థాయి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతు లభించలేదన్నారు. తాను చేయాలనుకున్న దాంట్లో 10 శాతమూ సాధించలేకపోయానంటున్న సంజీవ్ కుమార్ మద్దతివ్వని పార్టీలో కొనసాగలేకనే పార్టీకీ, ఎంపీ పదవికీ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మరి చూడాలి ఈ డాక్టర్ పోలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో?
.
.