Chandragiri Fake Votes : తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఓట్ల దందాపై తెలుగుదేశం పోరాటం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తుంది. ధ్రువీకరణ పత్రాలు లేకుండానే ఓట్లు నమోదు చెయ్యడంపై విచారణ జరుగుతోంది. కొంతమంది బీఎల్ఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల వ్యక్తుల ముఖాలు సరిగా లేకుండానే వారిని ఓటర్ల జాబితాలో చేర్చడానికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించి 49,956 వేల ఓట్లను చేర్పించడానికి ఫారం సిక్స్ దరఖాస్తులు సమర్పించారని టీడీపీ జాతీయ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్డీఓ నిశాంత్ రెడ్డి దీనిపై విచారణ చేశారు.
తిరుపతి రూరల్ మండలంలోని దాదాపు 24 వేల ఓట్లర్ల ముఖాలు సరిగా కనిపించకుండా ఉన్న వారి ఓట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. వారు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు కూడా సరిగా లేవని తెలుస్తొంది. దీంతో సంబంధిత బీఎల్ఓ లపై విచారణ ప్రారంభించారు. స్థానికేతరుల ద్వారా వారు ఫారం6 తీసుకున్నట్లు తెలుస్తోంది.
మొత్తం మీద నియోజకవర్గంలో ఫారం7 ద్వారా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, జనసేనకు సంబంధించిన ఓట్లను 50 వేలకు పైగా తొలగించారంటూ ఫిర్యాదు అందింది. దీంతోపాటు ఫారం సిక్స్ ద్వారా 50వేల ఓట్లను అదనంగా చేర్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అటు మండల ఎన్నికల అధికారి నుంచి జాతీయ ఎన్నికల కమిషనర్ వరకు టిడిపి చంద్రగిరి ఇంచార్జి పులవర్తి నానితోపాటు జనసేన ఇంచార్జ్ మనోహర్ కూడా పలుమార్లు ఫిర్యాదు చేశారు.