Rayudu Political Entry: మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. కొద్దిరోజులుగా రాజకీయాల్లో వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ క్రికెటర్ క్లారిటీ ఇచ్చారు. తాను పాలిటిక్స్లో ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించేశారు. ప్రజాసేవకు ముందు అన్ని విషయాలను తెలుసుకునే పనిలో అంబటి రాయుడు బిజీగా ఉన్నారు.
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో పర్యటించిన అంబటి రాయుడు.. ప్రజల నాడి తెలుసుకునేందుకు తాను గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలు, అవసరాలను తెలుసుకుంటున్నానని.. అన్నింటిపై ఓ అవగాహనకు వచ్చిన తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని తెల్చేశారు.
గతంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసినప్పటి నుంచి అంబటి రాయుడు రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ ప్రభుత్వం పరిపాలనను పొగుడుతూ అంబటి చేసిన కామెంట్స్, ట్వీట్లు ఈ ప్రచారానికి బలాన్నిచ్చాయి.వచ్చే ఎన్నికల్లో కృష్ణా లేదా గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం బలంగా సాగుతోంది.
అంబటి రాయుడు త్వరలోనే అధికారికంగా వైసీపీ కండుకా కప్పుకునే అవకాశం కనిపిస్తోంది. గుంటూరు లేదా మచిలీపట్నం ఎంపీగా బరిలో ఉంటారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే అంబటి రాయుడిని తమ పార్టీలో చేరాలని అటు టీడీపీతోపాటు.. జాతీయ పార్టీ బీజేపీ కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు కొందరు.. అంబటి రాయుడిని కలిసి తమ పార్టీల్లో చేరాల్సిందిగా ఆహ్వానించినట్లు సమాచారం.