Tdp ex mla to Ysrcp: ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలో టీడీపీకి షాక్ తగలబోతోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి టికెట్ దక్కలేదన్న కారణంగా మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేష్రెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆయన అసంతృప్తిని గమనించిన వైసీపీ ఎంపీ మిధున్రెడ్డి చర్చలు జరిపారు. దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. రేపోమాపో ఆయన ఫ్యాన్స్ పార్టీ కండువా కప్పుకోవడం ఖాయమంటున్నారు. ఇంతకీ టీడీపీ టికెట్ నిరాకరించడానికి కారణమేంటి? ఇంకా లోతుల్లోకి వెళ్తే..
రాయచోటి నియోజకవర్గం వైపీసీకి కంచుకోట. అక్కడి నుంచి గడికోట శ్రీకాంత్రెడ్డి ఉపఎన్నికతోపాటు నాలుగుసార్లు గెలుపొందారు. రెండుసార్లు ఆయన చేతిలో ఓడిపోయారు మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేష్రెడ్డి. పరిస్థితి గమనించిన టీడీపీ అధిష్టానం పలుమార్లు సర్వే చేయించింది. అయినా రమేష్రెడ్డి ఏమాత్రం అనుకూలంగా లేదని తేలింది. దీంతో అభ్యర్థిపై పలుదఫాలుగా జిల్లా నాయకులతో మంతనాలు సాగించింది. చివరకు మండిపల్లి రాంప్రసాద్రెడ్డికి టికెట్ కేటాయించడంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు.
కొద్దిరోజులుగా రమేష్రెడ్డి టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డికి అక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పరిస్థితి గమనించిన ఆయన, రమేష్రెడ్డితో మాట్లాడారు. చివరకు శనివారం రాత్రి ఎంపీ మిధున్రెడ్డితో ఆయన సమావేశమయ్యారు. పార్టీలో సముచిత స్థానం ఇస్తామని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కానీ.. సీటుపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈనెల తొమ్మిదిన జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
ALSO READ: బుక్కైన సీఎం రమేష్, 9న విచారణకు రావాలంటూ
అసెంబ్లీ అభ్యర్థులను ఒకేసారి వైసీపీ ప్రకటించింది. అంతేకాదు సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి ని కాదని మరో వ్యక్తికి ఫ్యాన్స్ పార్టీ సీటు ఇచ్చే అవకాశం లేదు. ఈ మాత్రం దానికి రమేష్రెడ్డి కంగారుపడి.. వైసీపీలోకి ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడంలేదని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. కడప జిల్లా అధ్యక్షుడు, పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డికి సోదరుడు రమేష్రెడ్డి. సొంత అన్న చెప్పినా రమేష్ వినలేదని సమాచారం. రమేష్రెడ్డి రాక తనకు కలిసొస్తుందని ఎంపీ అభ్యర్థి మిధున్రెడ్డి భావిస్తున్నారు.