Rape Attempt : పొద్దున్నే మొక్కజొన్న పొలానికి పిట్టల కావలికి వెళ్లిన ఓ మహిళపై దుండగుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణ శివార్లలో చోటుచేసుకుంది. ఆత్మకూరు పట్టణానికి చెందిన ఒక మహిళ తమ మొక్కజొన్న పంట వద్దకు వెళ్లింది. పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా అక్కడే కంది చేనులో మాటు వేసిన ఓ దుండగుడు ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. కేకలు వేస్తున్నా వదలకుండా వేధించాడు. ఆమె అతన్ని తోసేసి పరుగులు తీసింది. అయితే అదే సమయంలో మహిళ బంధువులు రావడంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
బాధిత మహిళ కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆత్మకూరు సీఐ నాగభూషణ్, ఎస్సైలు జి. కృష్ణమూర్తి, వెంకటనారాయణ రెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే దుండగుడు సమీపంలోని 15 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన మొక్కజొన్న తోటలోకి వెళ్లి దాక్కున్నాడు. ఆరు అడుగుల ఎత్తులో మొక్కజొన్న పైరు పెరగడంతో నిందితుడికి పట్టుకోవడం పోలీసులకు సమస్యగా మారింది. దీంతో వారు వెంటనే రెండు డ్రోన్ కెమెరాలను తెప్పించి నిందితుడి కోసం గాలింపు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఆయినప్పటికీ పోలీసులు పొలం చుట్టూ చేరి అక్కడే మకాం చేశారు. దీంతో ఎట్టకేలకు సాయంత్రం నిందితుడు మొక్కజొన్న చేనులో నుంచి బయటకు రావడంతో పోలీసులు అదుపులోకి తిసుకున్నారు. మొక్కజొన్న చేనులోకి వెళ్లిన నిందితుడు అప్పటికే మద్యం సేవించడంతో సాయంత్రం వరకు తోటలోనే నిద్రించినట్లు తెలిసింది. పట్టుబడిన నిందితుడు ఆత్మకూరు మండలం కరివేన గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. గతంలో కూడా ఇతను ఇదేవిధంగా ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది.