Union Minister Ram Mohan Naidu: ఇటీవల విమానాలకు బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి. అది కూడా అన్నీ ఫేక్ గా.. ఆకతాయిలు చేస్తున్న పనే. ఈ ఫోన్ల ధాటికి ఇటీవల పలు విమానాల రాకపోకలకు అంతరాయం కూడా కలిగింది. దీనితో ఎందరో ప్రయాణికులు పడ్డ ఇబ్బందులు కూడా అన్నీ ఇన్నీ కావు. అందుకే ఇటువంటి బాంబ్ బెదిరింపు కాల్స్ అంతు తేల్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఎంతటి వారినైనా గుర్తించి వారి భరతం పట్టడమే పనిగా సంబంధిత సెక్యూరిటీ అధికారులు దృష్టి సారించారు. తాజాగా ఇటువంటి ఫేక్ కాల్స్ గురించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు.
దేశవ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజులోనే విమానాలకు 7 బెదిరింపు కాల్స్ వచ్చాయి. అలాగే బెంగుళూరు విమానాశ్రయానికి కూడా ఇదే తరహా బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులు నిజమేనని భావించిన అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఆ తర్వాత ఫేక్ కాల్స్ అని అధికారులు గుర్తించారు. అయితే ఇటువంటి ఫేక్ కాల్స్ రావడం వల్ల పెను ప్రమాదమే పొంచి ఉందని ప్రయాణీకులు తెలుపుతున్నారు. వాస్తవంగా బాంబ్ బెదిరింపులు వచ్చినా కూడా.. ఫేక్ అనుకొనే ప్రమాదం ఉంటుందని, ఇటువంటి ఫేక్ కాల్స్ చేసేవారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించిన కేంద్రం అసలు ఈ ఫేక్ కాల్స్ సూత్రధారులు ఎవరంటూ ఆరా తీస్తోంది. ఇలా ఓ మైనర్ ను పోలీసులు ఇదే విషయంపై అరెస్ట్ చేశారు. అసలు మైనర్ చెప్పిన కారణానికి పోలీసులకు దిమ్మతిరిగింది. తన ఫ్రెండ్ ను కేసులో ఇరికించేందుకు ప్లాన్ చేసి, బెదిరింపు కాల్ చేసినట్లు తెలిపాడట ఆ మైనర్. ఇక అంతే పోలీసులు కేసు నమోదు చేసి, అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల ఇటువంటి ఘటనలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… కేవలం మూడే మూడు రోజుల్లో విమానాలకు 30కి పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయన్నారు. ఫోన్ కాల్స్ విదేశాల నుండి వస్తున్నాయా.. లేక ఎవరైనా వెనుక ఉండి చేయిస్తున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతుందన్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణ ఆధారంగా.. బెదిరింపు కాల్స్ వెనుక కుట్ర లేదని మంత్రి అభిప్రాయపడ్డారు. కొందరు మైనర్లు తెలిసీ తెలియక చేస్తున్న పనిగా గుర్తించామని, మళ్లీ ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
ఇటువంటి ఫేక్ కాల్స్ వల్ల వేల సంఖ్యలో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటారని, అలాగే ఎన్నో విమాన సర్వీసులు కూడా రద్దు కావడంతో, విమాన సంస్థలకు నష్టం వాటిల్లుతుందని, ఇటువంటి ఫేక్ కాల్స్ చేసి కటకటాల పాలు కావద్దని కేంద్ర పౌర విమానయాన శాఖ కోరుతోంది.