టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు ఫోన్ చేశారు. తన ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని పేర్కొన్నారు. లోకేశ్కు ధైర్యం చెప్పారు. తన ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయనకు రక్ష అని పేర్కొన్నారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమీ చేయలేవన్నారు. చేసిన మంచి పనులు, ప్రజాసేవే బాబును బయటకు తీసుకొస్తాయని రజనీకాంత్ అన్నారు.
ఎన్నో ఏళ్లుగా రజనీకాంత్ .. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. చాలా వేదికలపైనా టీడీపీ అధినేత విజన్ ను ప్రశంసించారు. ఇటీవల చంద్రబాబు ఆహ్వానంతో విజయవాడకు వచ్చారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనూ రజనీ.. చంద్రబాబును కొనియాడారు. ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో రజనీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడ్డారు. ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమానికి వచ్చి చంద్రబాబును పొగడటమేంటని ప్రశ్నించారు.
ఇటీవల విడుదలైన జైలర్ సినిమాలో డైలాగ్ పైనా వివాదం రేగింది. అర్థమయ్యిందా రాజా అంటూ తమిళ సూపర్ స్టార్ చెప్పిన డైలాగ్ వైసీపీ నేతలను ఉద్దేశించే పెట్టారని సోషల్ మీడియాలోనూ చర్చ జరిగింది. ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో రజనీ కాంత్ .. లోకేశ్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పి అండగా నిలిచారు.