Rain Forecast in AP & Telangana : దక్షిణ తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా పశ్చిమ విదర్భ, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఆవర్తనం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచీ పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాలపై కొనసాగుతోంది. మరోవైపు ఝార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకూ విస్తరించి ఉన్న ద్రోణి బలహీన పడింది. వీటి ప్రభావంతో నేడు, రేపు (మార్చి20,21) ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్రల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
నేడు అల్లూరి సీతారరామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో రెండ్రోజులు వర్షాలు పడే అవకాశం ఉంటుందని వెల్లడించింది. వీటి కారణంగా రాయలసీమ జిల్లాల్లో మాత్రం వేడి, తీవ్రమైన ఉక్కపోత, అసౌకర్య వాతావరణం ఉంటుందని తెలిపింది.
Also Read : వీడియో క్రియేటర్లకు బిగ్ షాక్.. యూట్యూబ్ కొత్త నిబంధన..?
ఇక తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది ఐఎండీ. ఇదే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే బుధ, గురు వారాల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఈ మేరకు తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.