RaghuramaKrishnaraju Comments on Jagan: ఈసారి ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఉండి టీడీపీ అభ్యర్థి రాఘురామకృష్ణరాజు. తమ పార్టీకి 125 నుంచి 150 మధ్యలో సీట్లు రావచ్చని మనసులోని మాట బయటపెట్టారు. శుక్రవారం తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించు కున్న ఆయన, మీడియాతో మాట్లాడారు. తామే అధికారంలోకి వస్తామని జగన్ మాటలపైనా ఆయన తనదైనశైలిలో వ్యాఖ్యానించారు.
తాను స్వామి సన్నిధిలో చెబుతున్నానని, ఇది ముమ్మాటికీ నిజమన్నారు రాఘురామకృష్ణరాజు. వైసీపీకి మహా అంటే 25 నుంచి 40 మధ్యలో సీట్లు రావచ్చారు. నాలుగు తారీఖు మధ్యాహ్నానానికి మీకే తెలుస్తుందన్నారు. గురువారం కుటుంబ సమ్మేతంగా తిరుమలకు వచ్చిన రాఘురామకృష్ణరాజు, శుక్రవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు.
ఇంతవరకు బాగానే ఉంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఎప్పుడూలేని విధంగా ఈసారి రసవత్తర పోటీ సాగింది. ద్విముఖ పోరు ఉండాల్సిన ఈ ప్రాంతంలో చతుర్ముఖంగా మారింది. అందరూ బలమైన క్షత్రియ సామాజికవర్గానికి చెందిన నాయకులే కావడంతో వీళ్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
Also Read: బాబుకు భద్రత పెంచిన కేంద్రం.. అందుకేనా?
టీడీపీ నుంచి రఘురామకృష్ణరాజు, వైసీపీ నుంచి పీవీఎల్ నరసింహరాజు, కాంగ్రెస్ నుంచి వేగేశ వెంకట గోపాలకృష్ణరాజు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా వెంటక శివరామరాజు బరిలో ఉన్నారు. ఈసారి గెలుపు ఎవరిది అన్నదే అసలు పాయింట్. ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 1983 నుంచి ఇప్పటివరకు జరిగిన తొమ్మిది ఎన్నికల్లో ఎనిమిదిసార్లు టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఒక్కసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచింది.
ఈసారి విజయం తనదేనని ధీమాగా చెబుతున్నారు రఘురామకృష్ణరాజు. దీనికితోడు పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడం తమకు కలిసొస్తుందని చెబుతున్నారు. గతంలో ఒకసారి ఓడిపోవడంతో ఓటర్లు తనవైపు ఉన్నారన్నది వైసీపీ అభ్యర్థి నరసింహరాజు మాట. రెండుసార్లు తాను టీడీపీ నుంచి గెలుపొందానని ఈసారి పీఠం తనదే అంటున్నారు స్వతంత్ర అభ్యర్థి వెంటక శివరామరాజు. కాంగ్రెస్ నుంచి వెంకట గోపాలకృష్ణరాజు బరిలో ఉన్నారు. తనకు గెలుపు అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు. మరి నాలుగు స్తంభాలతో కింగ్ ఎవరో తెలియాలంటే నాలుగువరకు ఆగాల్సిందే.