Purandeswari : ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్రంలో పర్యటనలకు శ్రీకారం చుట్టారు. తన తండ్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ బాటనే ఎంచుకున్నారు. ఆయన టీడీపీని స్థాపించిన తర్వాత రాయలసీమలో తొలిసారి పర్యటించారు. ఇప్పుడు పురందేశ్వరి కూడా ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టాక రాయలసీమ నుంచి తన పర్యటనలకు శ్రీకారం చుట్టారు.
వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరుకు పురందేశ్వరి వెళ్లారు. అక్కడ నిర్వహించిన బీజేపీ రాయలసీమ జోనల్ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలకు పురందేశ్వరి దిశా నిర్దేశం చేశారు. రాయల్ కౌంటీలో నిర్వహించిన ఈ సమావేశంలో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే వైసీపీ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు గుప్పించారు పురందేశ్వరి. తాజా సమావేశంలో అదే ధోరణిలో అనుసరించారు. రాష్ట్రానికి కేంద్రం సహకారం అందిస్తోందని తెలిపారు. అయితే అభివృద్ధి పనులు చేయడంలో రాష్ట్ర పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉన్నా.. సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర సర్కార్ విఫలమైందని ఆరోపించారు. తన తండ్రి ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారాన్ని రాయలసీమ నుంచే ప్రారంభించిన విషయాన్ని పురందేశ్వరి గుర్తు చేసుకున్నారు. తాను రాష్ట్ర పర్యటనను రాయలసీమ నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం విధానాలపైనే పురందేశ్వరి ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలను వివరిస్తున్నారు. టీడీపీతో పొత్తు అంశంపై ఆమె ఆచితూచి స్పందిస్తున్నారు. పొత్తులను బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందని చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మాత్రం త్వరలోనే భేటీ అవుతానని ఇప్పటికే పురందేశ్వరి చెప్పారు.