PSLV C58 : వరుస ప్రయోగాలతో రోదసిలో సరికొత్త విజయాలను నమోదు చేస్తున్న ఇస్రో.. 2024 తొలిరోజు మరో సరికొత్త విజయాన్ని అందుకుంది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ-సీ58 వాహకనౌక ‘ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహం’తో సోమవారం ఉదయం 9:10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం 8:10 గంటలకు ప్రారంభమైన 25 గంటల కౌంట్డౌన్ అనంతరం షార్లోని మొదటి లాంచ్ పాడ్ నుంచి బయలుదేరిన పీఎస్ఎల్వీ రాకెట్ తన లక్ష్యాన్ని చేరుకుంది.
ఇందులో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల XPoSatను అంతరిక్షంలోకి పంపారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్పోశాట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది. ఇందులో త్రివేండ్రంలోని ఎల్బీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థినులు రూపొందించిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు కూడా ఉన్నాయి.
రోదసిలోని కృష్ణ బిలాలను పరిశీలించటం ఎక్స్పోశాట్ ప్రధాన ఉద్దేశం. ఎక్స్రే ఫోటాన్లు, వాటి పోలరైజేషన్పై అధ్యయనం ద్వారా కృష్ణబిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్కు సంబంధించిన వివరాలను ఎక్స్పోశాట్ బహిర్గతం చేస్తుంది. ముఖ్యంగా ఇమేజింగ్, టైం-డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కొపీ అంశాలపై ఇది పనిచేయనుంది. నాసా తర్వాత ఇలాంటి ప్రయోగం చేసిన ఘనత మనకే దక్కటం విశేషం. అగ్రరాజ్యం 2021లో ఐఎక్స్పీఈ పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇది 5 ఏళ్ల పాటు రోదసిలో ఉంటూ ఎప్పటికప్పుడు భూమికి అక్కడి సమాచారం పంపనుంది.
పీఎస్ఎల్వీ చివరి దశలో మరో పది పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లింది. దీనికి ‘పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ (POEM)’ అని నామకరణం చేశారు. దీంట్లోనే తిరువనంతపురం ఎల్బీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారుచేసిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ను ఉంచారు.