Droupadi Murmu : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటిస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోగానే రాష్ట్రపతి.. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం వైఎస్ జగన్ రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. పోరంకి మురళి రిసార్ట్స్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పౌర సన్మానం చేసింది. ఈ కార్యక్రమానికి గవర్నర్, సీఎం హాజరయ్యారు.
ఏపీకి రాష్ట్రపతి ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్రతిష్ఠలకు నెలవు అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. తెలుగు భాష, సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమని.. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని కొనియాడారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. తన ప్రసంగంలో ఏపీకి చెందిన మహనీయుల గొప్పతనాన్ని రాష్ట్రపతి కీర్తించారు. అల్లూరి సీతారామరాజు, గురజాడ అప్పారావు, కవయిత్రి మొల్ల, దుర్గాభాయ్ దేశ్ముఖ్ పేర్లను ప్రస్తావించారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి నదులు రాష్ట్రాన్ని పునీతం చేశాయన్నారు. నాగార్జున కొండ, అమరావతి ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయని కొనియాడారు.
ఏపీకి ఘనచరిత్ర
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ తరఫున స్వాగతం పలుకుతున్నామని గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు. ఏపీ ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన రాష్ట్రమన్నారు. తెలుగు భాషకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉందన్నారు. ప్రపంచంలోనే తెలుగు అత్యంత మధురమైన భాషగా రవీంద్రనాథ్ ఠాగూర్ కీర్తించారు. కృష్ణా, గోదావరి లాంటి ఎన్నో జీవనదులు ఉన్న రాష్ట్రం ఏపీ అని గవర్నర్ అన్నారు.
ముర్ము జీవితం అందరికీ ఆదర్శం
దేశచరిత్రలో తొలిసారిగా ఓ గిరిజన మహిళ రాష్ట్రపతి పదవి చేపట్టడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని సీఎం జగన్ అన్నారు. సామాజిక వేత్తగా, ప్రజాస్వామ్యవాదిగా అణగారిన వర్గాల కోసం ఆమె కృషి చేశారని కొనియాడారు. జీవితంలో ద్రౌపదీ ముర్ము పడిన కష్టాలు.. వాటిని చిరునవ్వుతో స్వీకరించి ముందుకు సాగిన తీరు దేశంలోని ప్రతి మహిళకూ ఆదర్శమన్నారు. ఆమె రాజకీయంగా ఎదిగిన తీరు మహిళలకు స్ఫూర్తిదాయకమని జగన్ అన్నారు.
రాష్ట్రపతి గౌరవార్థం రాజ్భవన్లో గవర్నర్ ఏర్పాటు చేసిన విందులో ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. తన రెండు రోజుల పర్యటనలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ద్రౌపది ముర్ము పాల్గొంటారు.