Droupadi Murmu : తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో బస చేసిన రాష్ట్రపతి.. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట రాష్ట్రపతికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు స్వాగతం పలికారు. తొలుత వరాహ స్వామిని.. అనంతరం శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో ద్రౌపదీ ముర్ముకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు.
తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి శ్రీవారి చిత్రపటం, స్వామివారి తీర్థప్రసాదాలను రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతితోపాటు కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఏపీ మంత్రులు నారాయణస్వామి, ఆర్కే రోజా, కొట్టు సత్యనారాయణ శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులతో రాష్ట్రపతి భేటీ ఉంది. తిరుపతిలో కార్యక్రమాలు ముగిసిన తర్వాత రాష్ట్రపతి డిల్లీకి పయనమవుతారు.
ఆంధ్రప్రదేశ్లో రెండురోజుల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం విశాఖపట్నంలో నిర్వహించిన నేవీ డేకి హాజరయ్యారు. మరోవైపు ఈ నెల 28న శీతాకాల విడిది కోసం తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వస్తారు.