TDP Leader Prabhakar Chaudhary(Andhra pradesh political news today): ఆ టీడీపీ సీనియర్ నేతకు సీట్ కష్టాలు మొదలయ్యాయా? స్థానికంగా ఎంతో అభివృద్ధి చేశారన్న పేరు ఉన్నప్పటికీ.. టికెట్ గండం వెంటాడుతోందా? తాజా పరిణామాలు చూస్తుంటే ఔననే సమాధానం వస్తోంది. ఒకసారి మునిసిపల్ చైర్మన్గా, ఒకసారి ఎమ్మెల్యే గా గెలుపొందిన ఆ నాయకుడికి ఇటు సొంత పార్టీ నుంచే కాకుండా.. అటు మిత్ర పక్షం నుంచి కూడా సీట్ గండం పొంచి ఉందన్న టాక్ నడుస్తోంది. ఇంతకీ ఎవరా సీనియర్ నేత? ఏ నియోజకవర్గమో? మీరే చూడండి.
అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని పేరు. అయితే 2019 ఎన్నికల్లో సీన్ మారిపోయింది. మొత్తం ఉమ్మడి జిల్లాలో 14 సీట్లు ఉంటే టీడీపీ 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయినప్పటికీ జిల్లా టీడీపీలో క్యాడర్ చెక్కు చెదరలేదంటారు. పార్టీ గ్రౌండ్ లెవల్లో బలంగానే కనిపిస్తున్నా.. ఇప్పటి వరకు సీట్ల కేటాయింపు చేపట్టకపోవడంతో ఇటు కార్యకర్తలు.. అటు నేతలు టెన్షన్ పడిపోతున్నారు. టికెట్ కేటాయింపు లేట్ అవుతున్న కొద్ది కొత్త కొత్త నేతలు, కొత్త కొత్త ఎత్తులు తెరపైకి వస్తూ పార్టీ శ్రేణుల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి.
ఇన్నాళ్లు అనంత అర్బన్ టీడిపి టికెట్పై ఎవరికి అనుమానాలు లేవు.. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి ఫిక్స్ అని అంతా అనుకుంటున్న తరుణంలో సరికొత్త ఈక్వేషన్స్ తెరపైకి వస్తున్నాయి. అనంత అర్బన్లో పవన్ కల్యాణ్ పోటీ చేస్తే.. తానే దగ్గరుండి గెలిపించుకుంటానని ప్రభాకర్ చౌదరి చేసిన ప్రకటనతో.. ఆయనపై జన సైనికుల్లో పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది. ఆ వ్యాఖ్యలు చేసిన సందర్భంలోనే.. వేరే వారికి తన సీటు ఇస్తానంటే అంగీకరించేది లేదని ఆయన స్ఫష్టం చేశారు.
అది జరిగిన చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రభాకర్ చౌదరికి సీట్ కష్టాలు మొదలయ్యాయి అన్న టాక్ నడుస్తోంది. నిజానికి ప్రభాకర్ చౌదరికే టిక్కెట్ అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ ఇటీవల చంద్రబాబు ఉరవకొండ పర్యటనలో అనంత అర్బన్ టిక్కెట్ కోసం డజను అప్లికేషన్ లు రావడంతో ప్రభాకర్ చౌదరి ఖంగుతిన్నారట.
ప్రభాకర్ చౌదరికి అనంత అర్బన్ లో మంచి పాజిటివ్ ఇమేజే ఉంది. ఆయన ఎమ్మెల్యే గా, మునిసిపల్ చైర్మన్గా ఉన్నప్పుడే అనంతపురంలో అభివృద్ది జరిగిందన్న ప్రచారం ఉంది. ఆయన హాయంలో రోడ్లు, డ్రైనేజ్, పార్క్ లు, ఓపెన్ జిమ్లు ఇలా చాలా ఏర్పాట్లు చేసినట్టు ప్రజల్లో మంచి భావన ఉంది. అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పెద్దగా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు అన్న అభిప్రాయం సొంత పార్టీ కార్యకర్తల్లో ఉందట. ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో దాన్ని బేస్ చేసుకుని.. ఆయన వ్యతిరేకులు టికెట్ కోసం ఆయన కంటే గట్టిగా ట్రయల్స్ మొదలు పెట్టతారంట.
ముఖ్యంగా ప్రభాకర్ చౌదరి కి ఎప్పటి నుంచో జేసీ సోదరులతో విభేదాలు ఉన్నాయి. వారు అనేక సార్లు బహిరంగ విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ కూడా పడుతోందట ప్రభాకర్ చౌదరి మీద.. జేసీ బ్రదర్స్ అండతో కొందరు, సొంత స్థోమతతో ఇంకొందరు నేతలు అనంతపురం టికెట్ రేసులోకి వచ్చేస్తున్నారు. ఇక మిత్ర పక్షం జనసేన నుంచి తీవ్రమైన పోటీ ఉందంట. ఎప్పటి నుంచో అనంతపురం సిటీ జనసేన నేతలు ఈ స్థానం కోసం పట్టుబడుతున్నారు. ఉమ్మడి అనంత జిల్లాలోని రెండు స్థానాల్లో జనసేనకు బలమైన నాయకత్వం ఉంది. అందులో ఒకటి అనంత అర్బన్ స్థానం.. అందుకే జనసైనికులు ఈ స్థానం కోసం పట్టుబడుతున్నారు.
ఇక జనసేనకి ఈ స్థానం కేటాయించకపోయినా టీడీపీలో ఆశావహులు గట్టిగానే కనిపిస్తున్నారు. అనంత అర్బన్ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల క్యాడర్ ఎక్కువగా నివసిస్తుంటుంది. అందుకే సీటీలో తమ వారి అండ చూసుకుని ఇతర నియోజకవర్గాల ప్రముఖులు ఇక్కడ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారంట.
అలాంటి వారిలో రాప్తాడు ప్రాంతానికీ చెందిన ఓ ప్రముఖ పారిశ్రమికవేత్త పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆర్థికంగా కూడా ఆయన బలంగా ఉండడం కలసి వచ్చే అంశమంటున్నారు. మరో వైపు మహిళా కోటా, NRI కోటాలో ఓ మహిళ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నారు. వీరిద్దరూ కాకుండా మరో కాంట్రాక్టర్ కూడ టీడిపి లో తనకున్న పరిచయాలతో అనంత అర్బన్ టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. వారిలో ఎవరికి జేసీ బ్రదర్స్ సపోర్ట్ చేసినా ప్రభాకర్చౌదరికి గండం తప్పదంటున్నారు.
ఇప్పటికే జిల్లాలోని అనేక సెగ్మెంట్లలో టీడీపీ టికెట్ల వార్ నడుస్తోంది. ఇప్పుడా లిస్టులో అనంత అర్బన్ స్థానం కూడా వచ్చి చేరింది. అయితే పార్టీలో మొదట నుంచి కష్టపడ్డ వారికి కాకుండా వేరే వారికి ఎలా అవకాశం ఇస్తారన్న కన్ఫ్యూజన్ సీటీ టీడీపీ కేడర్లో కనిపిస్తోంది. ఏదేమైనా చంద్రబాబునాయుడి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.