Nellore news today telugu(AP political news) : నెల్లూరు పాలిటిక్స్ పీక్స్కు చేరాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ స్పందించారు. ప్రమాణం చేయాలన్న సవాల్ను స్వీకరించారు. నెల్లూరు వెంకటేశ్వరపురంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రమాణం చేశారు.
నాలుగు రోజులుగా లోకేష్.. అనిల్పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వెయ్యి కోట్ల వరకు దోచేశారని మండిపడ్డారు. భూములకు సంబంధించిన ఆస్తుల చిట్టా వెల్లడించారు. అవన్నీ బినామీలతో అక్రమంగా ఆర్జించారని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్పై లోకేష్ ఆరోపణలు గుప్పించారు.
లోకేశ్ ఆరోపించినట్టు.. ఆ భూములు తనవి కాదని చెప్పిన అనిల్.. తాజాగా గుడిలో ప్రమాణం చేశారు. ఎమ్మెల్యే అనిల్ ప్రమాణానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తనకు ఎలాంటి అక్రమ ఆస్తులు లేవని దేవుని ఎదుట ఎమ్మెల్యే అనిల్ కుమార్ ప్రమాణం చేశారు. తాను చెప్పిన విధంగానే వెంకటేశ్వర స్వామి ఎదుట ప్రమాణం చేశానని అన్నారు.
మరోవైపు.. నారా లోకేష్ ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రసన్నకుమార్ రెడ్డి 15 వందల కోట్ల అవినీతి చేశారన్న ఆరోపణలపై సీరియస్ అయ్యారు. లోకేష్ ఆరోపణలపై సీఎం జగన్ ను కలిసి సీబీఐ ఎంక్వైరీ కోరుతా అని స్పష్టం చేశారు నల్లపురెడ్డి. అవసరమైతే సిట్టింగ్ జడ్జితో విచారణకైనా సిద్ధమే అంటూ సవాల్ చేశారు. తాను అవినీతి చేశానని తేలితే బుచ్చి బస్టాండ్లో ఉరివేసుకుంటా.. అంటూ సంచలన కామెంట్ చేశారు నల్లపురెడ్డి.