Tadipatri : తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. జూనియర్ కాలేజీ ప్రహారీ గోడ నిర్మాణంపై జేసీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాజకీయంగా వివాదం రాజుకుంది. 60 అడుగుల రోడ్డు విడిచి గోడ నిర్మించుకోవాలని సూచించారు జేసీ. మాస్టర్ ప్లాన్ లో 60 అడుగుల రోడ్డు ఉందని కొలతలు వేసి మరీ పోలీసులకు చూపించారు.
నిర్మాణంలో ఉన్న 53 పిల్లర్లను పూడ్చి వేశారని ఓ వ్యక్తి పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో జేసీ సహా ఆయన అనుచరులపై తాడిపత్రి టౌన్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఎస్పీ తాడిపత్రి లో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముగ్గురు సీఐలను, భారీగా స్పెషల్ పార్టీ పోలీస్ బలగాలను మోహరించారు. జేసీ అనుచరులను అక్కడకి రాకుండా అడ్డుకున్నారు.
మరోవైపు కళాశాలకు ప్రహరీ నిర్మించి, గేటు ఏర్పాటు చేయటానికి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు సిద్ధమవడంతో టెన్షన్ క్రియేట్ అయ్యింది. నిర్మాణ పనులు చేసేందుకు వస్తున్నారని సమాచారం రావడంతో తాడిపత్రి డీఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జేసీ ప్రభాకర్రెడ్డి ఇంటి చుట్టూ బారికేడ్లు పెట్టారు.అదనపు ఎస్పీ విజయ్భాస్కర్ రెడ్డి జూనియర్ కళాశాల పరిసరాలను పరిశీలించారు.
ప్రహరీ వివాదంపై అధికారులు విచారణ చేయడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రెండు రోజులుగా ఈ వివాదంపై జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.