Political Sankranti in AP | సంక్రాంతి పండుగంటే ఠక్కున గుర్తొచ్చేది కోడి పందాలే. ఎక్కడికక్కడ పందెం కోళ్లతో పందెంరాయుళ్లు రెడీ అయిపోతుంటారు. అయితే ఈ సీజనుకు ముందే ఏపీలో పొలిటికల్ పందెం కోళ్లు హడావుడి మొదలైపోయింది. అన్ని పార్టీల్లో టికెట్ల కోసం నేతలు సై అంటే సై అంటూ పోటీ పడుతున్నారు.
Political Sankranti in AP | సంక్రాంతి పండుగంటే ఠక్కున గుర్తొచ్చేది కోడి పందాలే. ఎక్కడికక్కడ పందెం కోళ్లతో పందెంరాయుళ్లు రెడీ అయిపోతుంటారు. అయితే ఈ సీజనుకు ముందే ఏపీలో పొలిటికల్ పందెం కోళ్లు హడావుడి మొదలైపోయింది. అన్ని పార్టీల్లో టికెట్ల కోసం నేతలు సై అంటే సై అంటూ పోటీ పడుతున్నారు. టికెట్ దక్కకపోతే పార్టీ మారిపోవడమో? .. లేకపోతే సొంత పార్టీలోనే రెబల్స్ అవతారం ఎత్తడానికి కూడా రెడీ అయిపోతున్నారు. వైసీపీలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఇక టీడీపీ, జనసేనల పొత్తు నేపధ్యంలో వివిధ నియోజకవర్గాల్లో రెండు పార్టీల నేతలు పోటీకి సిద్దమవుతుండటంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది.
ఓ వైపు ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీల ఆరోపణలు..మరోవైపు ఈసీ అధికారుల పర్యటనలతో ఏపీలో ఎన్నికల జాతర మొదలైపోయింది. ఈ సారి ఎన్నికలు ముందే రావొచ్చన్న వార్తలతో.. రాజకీయ పార్టీలు యాక్షన్ ప్లాన్ను స్టార్ట్ చేశేసాయి. వైసీపీ ఇప్పటికే విడతలవారీగా అభ్యర్ధులను ప్రకటిస్తోంది. ఫస్ట్ లిస్టులో 11, సెకండ్ లిస్ట్లో 27, మూడో జాబితాలో 21 మందిని ఇన్చార్జులుగా ప్రకటించింది. ఇప్పటివరకు ప్రకటించిన 59 మంది అభ్యర్ధుల్లో ఎమ్మెల్యే అభ్యర్ధులతో పాటు, ఎంపీ అభ్యర్ధులను కూడా అధికార పార్టీ మర్చేసింది. ఏపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. వైసీపీ అధినాయకత్వం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల ఇన్చార్జులను మార్చేస్తుండటం ఆ పార్టీలో కలకలం రేపుతోంది.
ముఖ్యంగా రాజధాని అమరావతి పరిధిలోని విజయవాడ వైసీపీ నేతలలో పెద్ద గందరగోళమే కనిపిస్తోంది. పొలిటికల్ రాజధానిగా పేరున్న బెజవాడలో పశ్చిమ నియోజకర్గం నుంచి పెనమలూరు సెగ్మెంట్ల వరకు వైసీపీ నేతల్లో తీవ్ర పోటీ కనిపిస్తోంది. తాజాగా పెనమలూరు నియోజకవర్గం వైసీపీలో అసంతృప్తి అగ్గి రాజుకుంది. పెనమలూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మంత్రి జోగి రమేశ్ను నియమించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీని వీడేందుకు సిద్దమయ్యారు. ఇక పెనమలూరు టికెట్ ఆశిస్తున్న పడమటి సురేశ్ బాబు, తుమ్మల బుజ్జి వర్గాలు ఆందోళనలకు దిగుతుండటం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయంటున్నారు. మరోవైపు పార్థసారథి టీడీపీలో చేరతారన్న ప్రచారం ఆ పార్టీలో కూడా కలకలం రేపుతోంది.
వైసీపీలో రచ్చ అలా ఉంటే.. పెనమలూరు టీడీపీలో సైతం ఆందోళనలు మొదలయ్యాయి. గత ఎన్నికల్లో పార్థసారథి చేతిలో పరాజయం పాలైన మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వర్గం తమ నేతకే టికెట్ ఇవ్వాలని ఆందోళన షురూ చేసింది. పార్థసారథి టీడీపీలో చేరడం ఖాయమవ్వడం.. ఆయనకే పెనమలూరు టీడీపీ టికెట్ ఇస్తారన్న ప్రచారంతో .. బోడే ప్రసాద్ వర్గంలో కలవరం మొదలైంది. దాంతో వారు చంద్రబాబు కాన్యాయ్ని అడ్డుకునే వరకు వెళ్లింది పరిస్థితి . ఒకవేళ పార్ధసారధికే కనుక టికెట్ ఇస్తే మాత్రం పెనమలూరు టీడీపీలో చిచ్చు రగలడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తమ్మీద పెనమలూరులో ఈ పొలిటికల్ పందెం కోళ్ల ఫైట్ రసవత్తరంగా మారింది.
విజయవాడ సెంట్రల్లో టీడీపీ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమకు పోటీ లేదు. అయితే వైసీపీ మార్పుల చేర్పుల రాజకీయం అక్కడ కలకలం రేపుతోంది. పశ్చిమ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్గా ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన కొన్ని నిమిషాల్లోనే సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరులు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. దాంతో మల్లాది విష్ణు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆ క్రమంలో ఆయన తన సొంతగూడు.. కాంగ్రెస్లోకి తిరిగి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుచరవర్గం భావిస్తోంది. అదే జరిగి కాంగ్రెస్ అభ్యర్దిగా విష్ణు పోటీలో ఉంటే వెల్లంపల్లికి కష్టాలు తప్పవంటున్నారు.
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీను విజయవాడ సెంట్రల్కు షిఫ్ట్ అవ్వడంతో.. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ టికెట్ ముస్లిం వర్గానికి చెందిన షేక్ ఆసిఫ్కు దక్కింది. ఆయనకు నియోజకవర్గ సమన్వయబాధ్యతలు కట్టబెట్టారు జగన్. పశ్చిమలో గెలిచి జగన్కి గిఫ్ట్గా ఇస్తానంటున్న ఆసిఫ్కు వెల్లంపల్లి వర్గం ఎంత వరకు సహకరిస్తుందో అనుమానమే. మరోవైపు వెస్టు సీటుపై జనసేన, టీడీపీల్లో తీవ్రపోటీ కనిపిస్తోంది. అక్కడి మాజీ ఎమ్మెల్యే జలీల్ఖాన్ కూతురు షబానా ఖాతూన్ గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో వెస్ట్ నుంచి జనసేన అభ్యర్ధిగా పోటీ చేసిన పోతిన వెంకట మహేష్ మూడో స్థానంలో నిలిచినప్పటికీ 15 శాతం ఓట్లు సాధించారు. ఆయన చీల్చిన ఓట్లే టీడీపీ ఓటమికి కారణమయ్యాయన్న అభిప్రాయం ఉంది. ఈ సారి టీడీపీ, జనసేనల పొత్తు నేపధ్యంలో పశ్చిమ సీటు జనసేనకు కేటాయించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఒకవేళ అక్కడ నుంచి పోతిన మహేష్ పోటీకి దిగితే.. జలీల్ ఖాన్ ప్రత్యామ్నాయం చూసుకునే పరిస్థితి నెలకొంది.
ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ను కాదనే వారు ఆ పార్టీలో ఎవరూ లేకపోయినా.. వైసీపీ అభ్యర్థిపైనే సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన అక్కడ వైసీపీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. అయితే అక్కడి నుంచి పోటీకి దేవినేని అవినాష్ కూడా ప్రయత్నిస్తున్నారు. అవినాశ్కు తూర్పు టికెట్పై జగన్ హామీ కూడా ఇచ్చారన్న ప్రచారం ఉంది. ఇక గత ఎన్నికల్లో వైసీపీ నుంచి తూర్పు టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ఈ సారి ఇతర పార్టీ నుంచి పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపధ్యంలో ఈస్ట్ వైసీపీలో పొలిటికల్ కోళ్ల పందెం ఉత్కంఠ రేపుతోంది.
అలాగే విజయవాడ పక్కనే ఉన్నమంగళగిరి సెగ్మెంట్ రాజకీయం కూడా ఆసక్తికరంగా తయారైంది. అక్కడ వైసీపీ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన ఆర్కేని పక్కన పెట్టేశారు జగన్. ఆయన స్థానంలో టీడీపీ నుంచి వచ్చి చేరిన గంజి చిరంజీవిని ఇన్చార్జ్గా ప్రకటించారు. టీడీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన నారా లోకేష్ ఈ సారి కూడా మంగళగిరి బరిలో దిగనున్నారు. అలాంటి మంగళగిరి నియోజకవర్గంలో గంజి చిరంజీవి టీడీపీలో కీలక నేతగా ఉండేవారు. 2014లో మంగళగిరి నుంచి పోటీ చేసి 12 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఆర్కేపై ఓడిపోయారు ఈ చేనేత నాయకుడు. ఇప్పుడు చిరంజీవిని మంగళగిరి వైసీపీ ఇన్చార్జ్గా ప్రకటించడంతో ఆర్కే వైసీపీకి రిజైన్ చేశారు. కాంగ్రెస్లో చేరిన షర్మిల వెంట నడుస్తానని ప్రకటించి వైసీపీలో కలకలం రేపుతున్నారు .