AP BJP: బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. సరైన సమయంలో సంచలన మార్పు చేసింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై వేటు వేసింది. పురందేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగించడం మరింత ఆసక్తికరం.
సోముపై వేటు అంతా ఊహించిందే. పురందేశ్వరికి పార్టీ బాధ్యతలు ఇవ్వడమే అనూహ్యం. ఎన్టీఆర్ కూతురుగా స్వతహాగా మంచి ఇమేజ్ ఉంది. కాంగ్రెస్ తరఫున రెండుసార్లు ఎంపీగా, ఓ దఫా కేంద్రమంత్రిగా చేసినా.. బీజేపీలో చేరినప్పటినుంచీ పార్టీ లైన్కు కట్టుబడి ఉన్నారు. ఏ ఒక్క వర్గంలో చేరకుండా.. గ్రూపులకు దూరంగా ఉన్నారు. ఆమెకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంపై ఏ ఒక్కరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు.
ఇక, పురందేశ్వరి.. నందమూరి ఫ్యామిలీ. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో దగ్గరి బంధుత్వం. ఇన్నాళ్లూ చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న సోము వీర్రాజును తొలగించి.. ఆమెకు కిరీటం కట్టబెట్టడం చూస్తుంటే.. బీజేపీ.. టీడీపీతో పొత్తుకు రూట్ క్లియర్ చేసినట్టే అని తెలుస్తోంది. పొత్తు ప్రక్రియ సాఫీగా సాగేందుకే అన్నట్టు.. ఆ ఫ్యామిలీకే చెందిన పురందేశ్వరిని పార్టీ తరఫున పెద్దగా చేశారు. ఆమె ఎంపిక.. టీడీపీ కోసమేననే అంటున్నారు.
ఇన్నాళ్లూ అధికార వైసీపీతో రహస్య స్నేహం చేస్తూ వస్తోంది కమలదళం. జనసేనాని జోక్యంతో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. బీజేపీని.. బలవంతంగా టీడీపీకి చేరువ చేస్తున్నారు పవన్ కల్యాణ్. సీఎం జగన్ను గద్దె దించాలంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దని గట్టిగా చెబుతున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీల పొత్తు తప్పనిసరి అని బలంగా వాదిస్తూ వస్తున్నారు. ఎట్టకేళకు జనసేనాని మొరను.. బీజేపీ అధిష్టానం ఆలకించినట్టుంది. ఇటీవలే అమిత్షా.. చంద్రబాబును ఢిల్లీకి పిలిపించుకొని చర్చలు జరిపారు. పొత్తుకు అడ్డుగా ఉన్న వీర్రాజును తప్పించారు. ఆ బంధం మరింత ధృఢమయ్యేలా.. చంద్రబాబు సమీప బంధువైన పురందేశ్వరిని ఏపీ బీజేపీ చీఫ్గా నియమించారు. ఇదంతా.. టీడీపీతో పొత్తు కోసమేనని అంటున్నారు. ఆ మేరకు బీజేపీకే పవన్ కల్యాణ్ రోడ్ మ్యాప్ ఇచ్చారని తెలుస్తోంది.
ఇక, ఇటీవలే కాషాయ కండువా కప్పుకున్న మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని.. జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంది పార్టీ. నల్లారి మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్లోకి రావడమూ బీజేపీకి అదనపు ప్రయోజనమే. సీమలో ఆయన ప్రభావం బాగానే ఉంటుంది. ఆ విధంగా చూసినా.. జగన్కు చెక్ పెట్టేలానే.. బీజేపీలో మార్పులు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అయితే, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో ఉండటం మరింత ఆసక్తికరం.