Jagan: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. వరుసబెట్టి కేంద్ర పెద్దలను కలిశారు. ఎప్పటిలానే రాష్ట్ర సమస్యలు, విభజన హామీలు, ఏపీకి రావాల్సిన నిధుల గురించి అడిగారు. అంతేనా? ఇంకేం లేదా? అంటే చాలానే ఉందనే లీకులు వస్తున్నాయి.
ఏపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయ్. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఎన్టీయేలోకి టీడీపీని మళ్లీ చేర్చుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయ్. ఇటీవల ఏపీకి వచ్చిన నడ్డా, అమిత్షాలు.. జగన్ ప్రభుత్వంపై బహిరంగ విమర్శలే చేశారు. ఆ వెంటనే.. తనకు బీజేపీ సపోర్ట్ లేకపోవచ్చు అంటూ జగన్ సైతం పొలిటికల్ కామెంట్ చేశారు. అయితే, ఆవేశంలో ఏదో అనేశారు కానీ.. ఆ తర్వాత ఆలోచిస్తే ఏదో తేడాగా అనిపించినట్టుంది. అందుకే, షార్ట్ గ్యాప్లోనే మళ్లీ హస్తిన బాట పట్టారు జగన్. కేంద్ర పెద్దల గడప గడపకూ తిరిగారు.
జనసేనాని వారాహి మీద విజయ యాత్ర చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని చెబుతున్నారు. పవన్ ప్రోద్బలంతో అమిత్షా సైతం చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఆ మూడు పార్టీల పొత్తు దాదాపు కన్ఫామ్ అంటున్నారు. ఇదే సమయంలో కీలకమైన ఏపీ బీజేపీ అధ్యక్షుడిని మార్చేశారు. వైసీపీని సాఫ్ట్గా డీల్ చేస్తున్న సోము వీర్రాజును తప్పించి.. చంద్రబాబుకు సమీప బంధువైన పురందేశ్వరికి కాషాయ పగ్గాలు అప్పగించడం.. జగన్కు మింగుడుపడని అంశమే. పురందేశ్వరి ఎంట్రీతో పొత్తు సాఫీగా సాగిపోతే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇదే జగన్లో కంగారుకు కారణం. అందుకే, పరుగెత్తుకెళ్లి ఢిల్లీలో వాలిపోయారని అంటున్నారు.
నేనేమి చేశాను నేరం.. అంటూ జగన్ తన వెర్షన్ వినిపించారని తెలుస్తోంది. నాలుగేళ్లుగా ప్రతీఅంశంలో కేంద్రానికి మద్దతుగా నిలిచారు. ఆ మేరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి కావలసినన్ని నిధులూ రప్పించుకున్నారు. జగన్పై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విచారణ.. నత్తకంటే స్లోగా సాగుతోంది. ఇంకేం.. అంతా బాగానే ఉందనుకుంటుండగా.. మధ్యలో పవన్ కల్యాణ్ వేగంగా పావులు కదిపారు. బీజేపీకి టీడీపీని దగ్గర చేస్తూ.. వైసీపీని దూరం చేయడంలో దాదాపు సక్సెస్ అయ్యారు. జనసేనాని ప్రభావంతోనే బీజేపీ.. జగన్ను దూరం పెట్టిందనేది ఓపెన్ సీక్రెట్. కేంద్రం సపోర్ట్ లేకుంటే.. వైసీపీ ప్రభుత్వ మనుగడ చాలా కష్టం. కేసుల్లో నిండామునిగి ఉన్న జగన్కు నష్టం. అందుకే, ఆలసించినా ఆశాభంగం అని భావించిన జగన్మోహన్రెడ్డి.. హస్తిన వెళ్లి తనవంతు వివరణ ఇచ్చారని సమాచారం. తనవెంట బీజేపీ పెద్దలకు సన్నిహితుడైన ఎంపీ విజయసాయిరెడ్డిని సైతం వెంటబెట్టుకెళ్లడం అందుకే అంటున్నారు. మరి, అంతా సావధానంగా ఆలకించి.. ఆ తర్వాత తాము చేయాల్సింది చేసే బీజేపీ బాసులు.. జగన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..చూడాలి.