AP assembly session updates(Andhra pradesh political news): ఏపీలో పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. అసెంబ్లీ సమావేశాల వేళ రాజకీయం రంజుగా మారింది. ఓ వైపు ప్రశంసలు మరోవైపు విమర్శలు. ఇలా సభ లోపలా.. బయటా.. అనేక ఆసక్తికర అంశాలతో పాటు.. వాడి వేడి వాదనలు జరిగాయి. అవేంటి? వాటి వెనకున్న అసలు విశేషాలేంటో చూద్దాం. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని వినిపించారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఏపీ అభివృద్ధికి చాలా కృషి చేశారని కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు దెబ్బతిన్నాయన్నారు. ఎన్నికల్లో ప్రజలు చాలా యాక్టివ్గా పాల్గొన్నారని.. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై కూడా చాలా తీవ్రంగానే రియాక్ట్ అయ్యారు.
ఎప్పటినుంచో ఏపీ ప్రజల్లో ఒక డౌట్ ఉండేది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వస్తారా? రారా? అని.. కానీ అంతా అనుకున్నట్టు ఆయన వచ్చారు. అంతా అందరూ అనుకున్నట్లే నిరసన వ్యక్తం చేశారు. అంతా ఎక్స్పెక్ట్ చేసినట్టే వాకౌట్ చేసి వెళ్లిపోయారు. నిజానికి గవర్నర్ ప్రసంగం మొదలుపెట్టగానే వైసీపీ నేతలు నిరసనకు దిగారు. అడుగడుగునా ఆయన ప్రసంగానికి అడ్డు పడ్డారు. తమ పాలనపై అబద్ధాలు చెప్పించారని.. ఏపీలో రాక్షస పాలన జరుగుతుందంటూ నిరసనకు దిగారు. చివరకు సభ నుంచి వాకౌట్ చేసి.. బయట నిరసన తెలిపారు.
అసెంబ్లీ బయట కూడా ఓ హైవోల్టేజ్ సీన్స్ కనిపించాయి. జగన్, ఆయన పార్టీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. ఏపీ అసెంబ్లీ గేటు వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. వారి వద్దనున్న ప్లకార్డులు, నల్ల కండవాలను తీసుకున్నారు. దీంతో జగన్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ అధికారుల పేర్లు చెబుతూ మరీ వార్నింగ్ ఇచ్చారు జగన్.. అయితే జగన్ ఇంకా ఆయన పార్టీ నేతల తీరుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు.
తాను తప్పులు చేసి.. పక్కవారిపై నెట్టేయడం వైసీపీ అధినేతకు అలవాటే అని.. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని చెబుతున్నారు. వివేకా హత్య కేసులాగానే.. వినుకొండ హత్యను కూడా తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు.. ఇక మొదటి రోజే అసెంబ్లీలో జగన్ వ్యవహరించిన తీరు చూసి తనకు అసహ్యమేసిందన్నారు పవన్.. అసెంబ్లీ ప్రాంగణంలో జగన్ వ్యవహరించిన తీరుపై టీడీపీ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో చూస్తే విషయం అర్థమవుతుందని.. ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదంటూ ట్వీట్ చేసింది.
Also Read: బాబు ఎఫెక్ట్..గుంటూరులో ఎకరం కోటి?
నిజానికి అసెంబ్లీలో జగన్ ఉండరనేది అందరికి తెలిసిందే..కానీ .. ఆయన మరీ ఇంత త్వరగా వెళ్లిపోతారని ఎవ్వరూ అనుకోకుండ ఉండరు. ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్తారు. బుధవారం ఢిల్లీలో ధర్నాకు దిగనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన మరో ఇంట్రెస్టింగ్ విషయం మీకు తెలుసా? ప్రస్తుతం బద్ధశత్రువులుగా ఉన్న వైఎస్ జగన్, రఘురామకృష్ణరాజు కలిసి మాట్లాడుకోవడం. అసెంబ్లీ హాల్లోజగన్, రఘురామ కృష్ణంరాజు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఇక్కడి వరకు చాలా క్లారిటీగా ఉంది. అయితే రోజు అసెంబ్లీకి రావాలని ట్రిపుల్ ఆర్ జగన్ను కోరారట.
ప్రతిపక్షం లేకపోతే ఎలా అని మాట్లాడారట. దీనికి జగన్ నవ్వుతూ రెస్పాండ్ అయ్యారట. రెగ్యులర్గా వస్తా.. మీరే చూస్తారుగా అని జగన్ చెప్పారట. ఇలా అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. అంతేకాదు అసెంబ్లీలో జగన్ పక్కనే సీట్ వేయించాలని పయ్యావుల కేశవ్ను రఘురామ కోరారట. ఇద్దరి మధ్య కొన్ని నిమిషాల పాటు మాటామంతీ అయితే జరిగింది. కానీ ఏం మాట్లాడుకున్నారనేది వారిద్దరికి మాత్రమే తెలుసు.. ఇదీ అసలు నిజం.
అయితే వీరిద్దరు మాట్లాడుకోవడం మాత్రం అనూహ్యమే అని చెప్పాలి. ఎందుకంటే ట్రిపుల్ ఎంపీగా గెలిచింది వైసీపీ టికెట్పైనే.. ఆ తర్వాత సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేయడం. ఆ తర్వాత ఆయనపై కేసు నమోదవ్వడం.. విచారణ పేరుతో తనను హింసించారని చెప్పడం.. ఇప్పుడు జగన్పై ఆయన రివర్స్లో కేసు నమోదు చేయడం.. ఇలా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్టైల్లో నడుస్తుంది వ్యవహారం..అలాంటి వారు ఎదురెదురుగా నవ్వుకుంటూ మాట్లాడుకోవడం మంచి వ్యవహారమే కదా..
అయితే ఈ అసెంబ్లీ వ్యవహారం ఇప్పుడే మొదలైంది. ముందుముందు అసలు కథ ఉండబోతుంది. అనేక బిల్లులు సభ ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు రోజుల పాటు ఆయన ఎలాగైనా సభకు రారు. మరి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాతైనా.. జగన్ సభకు వస్తారా? లేదా? అనేది చూడాలి.