కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.ఇటీవీల వైసీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబుపై మాజీ మంత్రి , పెద్దాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర విమర్శలు చేశారు. రామేశ్వరం మెట్ట, ఆనూరు మెట్టలో మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
చినరాజప్ప చేసిన ఆరోపణలపై దవులూరి దొరబాబు ఘాటుగా స్పందించారు. తాను ఎలాంటి మట్టి తవ్వకాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. నిజాయితీని నిరూపించుకునేందుకు తాను సిద్ధమన్నారు. ఈ క్రమంలో లైడిటెక్టర్ టెస్ట్ చేయించుకునేందుకు సిద్ధమయ్యారు.
లైడిటెక్టర్ టెస్టు కోసం ఢిల్లీలో ట్రూత్ ల్యాబ్ అనుమతి తీసుకున్నారు దొరబాబు. బాండ్ పేపర్లపై సంతకం చేసి లైడిటెక్టర్ పరీక్ష చేయించుకునేందుకు మున్సిపల్ సెంటర్కు బయలుదేరారు. లైడిటెక్టర్ టెస్టుకు సిద్ధం కావాలని చినరాజస్పకు దవులూరి దొరబాబు సవాల్ విసిరారు. సోమవారం మున్సిపల్ సెంటర్కు రావాలని ఛాలెంజ్ చేశారు.
తాను వచ్చేందుకు సిద్ధమని అక్కడే తేల్చుకుందామని నిమ్మకాయల చినరాజప్ప తిరిగి కౌంటర్ ఇచ్చారు. తెలిపారు.ఈ నేపథ్యంలోనే ఇరువురు నేతలు తమ పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మున్సిపల్ సెంటర్కు వెళ్లేందుకు వైసీపీ, టీడీపీ నేతలు సిద్ధపడ్డారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
టీడీపీ, వైసీపీ నేతల మధ్య సవాళ్ల నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పెద్దాపురంలోని వైసీపీ, టీడీపీ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. దవులూరి దొరబాబును అడ్డుకున్నారు. వైసీపీ కార్యాలయం వద్దే ఆయనను ఆపేశారు. అలాగే చినరాజప్పను నిలువరించారు. దీంతో అక్కడ కొంతసేపు టెన్షన్ వాతావరణం ఏర్పడింది.