AP GIS: ఏపీ పాలిటిక్స్ ఎల్లప్పుడూ హాట్ హాట్గానే ఉంటాయి. జగన్, చంద్రబాబు, పవన్ల డైలాగ్ వార్ డైలీ సాగుతుంది. వైసీపీ పాలనపై నిత్యం విమర్శలు చేస్తూనే ఉంటాయి ప్రతిపక్షాలు. వాటిలో అనేక వాటికి కౌంటర్లు ఇస్తుంటారు వైసీపీ నేతలు. కానీ, కొన్ని విమర్శలకు మాత్రం ప్రభుత్వం దగ్గర కౌంటర్ ఉండేది కాదు.
ఏపీలో అన్నీ గుంతలమయమైన రోడ్లంటూ టీడీపీ, జనసేనలు ఫోటోలు, వీడియోలతో కుమ్మేస్తుంటే.. అధికారపార్టీ కామ్గా భరించడం మినహా రివర్స్ ఆన్సర్ చెప్పే పరిస్థితి లేదు.
ఏపీని దివాళా తీయించారని.. ఒక్కటంటే ఒక్క కొత్త పరిశ్రమ అయినా వచ్చిందా? అంటూ చంద్రబాబు, పవన్లు పదే పదే గిల్లిగా.. గిల్లించుకునే పరిస్థితే ఉండేది. చికెన్, మటన్ షాపులు పెట్టారుగా.. అంటూ జనసేనాని టీజ్ చేసినా పడాల్సి వచ్చింది. కానీ, ఇకపై ఈ విమర్శలకు వైసీపీ పక్షం నుంచి స్ట్రాంగ్ కౌంటర్ తప్పక ఉంటుంది. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించి.. మూడున్నరేళ్లుగా ప్రతిపక్షాలు చేస్తూ వచ్చిన ఆరోపణలకు.. నోరు మూయించేలా సమాధానం చెప్పారని అంటున్నారు. ఇకపై, ఏపీకి ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? అని నిలదీయడానికి చంద్రబాబు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తుందేమో.
సిమెంట్ ఫ్యాక్టరీలు, స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్, పునరుత్పాదక పవర్ ప్రాజెక్టులు.. ఇలా మొత్తంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులకు, 15 రంగాల్లో.. 352 ఎంవోయూలు కుదిరాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 6 లక్షల మందికి ఉపాధి అవకాశం లభిస్తుందని సీఎం జగన్ చెప్పారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సక్సెస్ అయిందని సంతోషం వ్యక్తం చేశారు.
నితిన్ గడ్కరీ, కిషన్రెడ్డి.. అంబానీ, అదానీ, జిందాల్, జీఎంఆర్, కృష్ణా ఎల్లా, అపోలో సంగీతా.. ఇలా హేమాహేమీలే విశాఖ జీఐఎస్కు తరలిరావడంతో బిగ్ ఈవెంట్.. బిగ్ సక్సెస్ అయిందనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇక పెట్టుబడులు ఎప్పుడొస్తాయి? పరిశ్రమలు ఎప్పుడు పెడతారు? ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి? అనేది ముందుముందు తెలుస్తుంది. అప్పటివరకూ.. పెట్టుబడుల కోసం సీఎం జగన్ ఎలాంటి ప్రయత్నం చేయడం లేదనే ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టొచ్చు. దావోస్కి వెళ్లలేదు.. రివర్స్ టెండర్లతో రివర్స్ పాలన.. జే ట్యాక్స్.. ఇలాంటి ఆరోపణలు ఇకపై తగ్గిపోవచ్చు. ఇలా ఒక్క విశాఖ జీఐఎస్తో.. అనేక అడ్వాంటేజ్లు సాధించింది జగన్ సర్కార్.
సీఎం జగన్ ఓ స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళుతున్నారని అంటున్నారు. ఆయన పాలనా కాలంలో రెండేళ్ల పాటు కరోనా ప్రాబ్లమే ఉంది. ఆ సమయంలో ప్రపంచ ప్రగతే ఆగిపోయింది. ఆ తర్వాత అయినా పెట్టుబడుల కోసం గట్టి ప్రయత్నాలు చేయలేదనేది విపక్షం ఆరోపణ. దావోస్కి వెళ్లకపోవడం బిగ్ మైనస్. ఇలాంటి విమర్శలు వస్తాయని జగన్కు ముందే తెలుసు. ఆయన సరైన సమయం కోసం వెయిట్ చేశారని అంటున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. ఇక ఆలస్యం చేయకుండా కార్యచరణకు దిగిపోయారని చెబుతున్నారు.
రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి దారుణంగా ఉందని తెలిసి.. అధికారులతో పాటు ఐప్యాక్ టీములతోనూ సర్వేలు చేయించి.. నియోజకవర్గానికి 5 ప్రధాన రోడ్లను గుర్తించి.. యుద్ధప్రాతిపదికన రోడ్లు వేసేందుకు సర్కారు సన్నద్ధం అవుతోంది. ఎన్నికల హీట్ పెరిగే సరికి.. ఏపీ రోడ్ల మీద కామెంట్లు వినిపించకుండా అంతా స్మూత్ వే చేయాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక, పరిశ్రమలు, పెట్టుబడుల విషయంలోనూ ఇన్నాళ్లూ జగన్ ఇమేజ్ బాగా డ్యామేజ్ కావడంతో.. ఇప్పుడు ఒకేఒక్క గ్రాండ్ ఈవెంట్తో.. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్తో.. ప్రతిపక్షాల నోళ్లకు తాళం వేసే ప్రయత్నం చేశారని అంటున్నారు. అందుకే కావొచ్చు, విశాఖ సమ్మిట్తో విపక్షం కోమాలోకి వెళ్లిందంటూ మంత్రి రోజా విజయగర్వం ప్రదర్శించారు. వన్ సమ్మిట్.. మెనీ టార్గెట్స్!