TDP: గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల దాడి. వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా విరుచుకుపడి ఆఫీసును ధ్వంసం చేశారు. ఫర్నీచర్ పగలగొట్టారు. కారును తగలబెట్టారు. ఆ విధ్వంసాన్ని టీవీల్లో చూసిన పలువురు టీడీపీ నేతలు హుటాహుటిన గన్నవరం వెళ్లారు. అందులో పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి కూడా ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసు దగ్గరకు చేరుకోకుండానే.. పట్టాభిరామ్, చిన్నా, గురుమూర్తి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచీ ఆయన అడ్రస్ లేరు. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో తెలీదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్. పట్టాభి భార్య తెగ టెన్షన్ పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా, పట్టాభి అడ్రస్ లేదు.
కట్ చేస్తే.. మర్నాడు మధ్యాహ్నం గన్నవరం పోలీస్ స్టేషన్ కు పట్టాభిని తీసుకొచ్చారు పోలీసులు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి.. కోర్టుకు తరలించారు. కోర్టులోకి వెళుతున్న సమయంలో పట్టాభి తన చేతులను మీడియాకు చూపిస్తో సైగలు చేశారు. తనను బాగా కొట్టారని.. చేతులు వాచిపోయాయని అనే మెసేజ్ ఇచ్చారు.
కోర్టులోనూ ఇదే విషయం చెప్పారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్కు తనను తీసుకు వెళ్లి చీకట్లో ఉంచారని.. ముసుగులో వచ్చిన ముగ్గురు.. తన ముఖానికి టవల్ చుట్టి.. అరగంట పాటు కొట్టారని, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని.. న్యాయమూర్తికి, న్యాయవాదికి వివరించారు పట్టాభి.
పోలీసులు తన భర్త పట్టాభిరామ్ను దారుణంగా హింసించారని ఆయన భార్య చందన సైతం ఆరోపించారు. ఉన్నతాధికారుల సహకారంతోనే ఇదంతా జరిగిందని విమర్శించారు. తోట్లవల్లూరు పీఎస్లో తన భర్తను ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు కొట్టారని.. ఆయనకు ప్రాణగండం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. చందన సైతం గన్నవరం వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆమెను విజయవాడలోని ఇంటి దగ్గరే అడ్డుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.
ఇంతకీ పట్టాభిని పోలీసులు కొట్టారా? ఆయన చేతులు కమిలిపోయాయా? పట్టాభి తనను దారుణంగా కొట్టారని నేరుగా కోర్టులోనే చెప్పారు. టీడీపీ వర్గాలు మాత్రం కొట్టారనే అంటున్నాయి. ముసుగు వేసుకొచ్చి మరీ ఓ ముగ్గురు కొట్టారని క్లియర్గా చెబుతున్నారు. పట్టాభి సైతం తన చేతులు వాచిపోయాయంటూ మీడియాకు చూపించారు. పట్టాభిని నిజంగా పోలీసులు కొట్టి ఉంటే మాత్రం అది దారుణమైన విషయమే.
గతంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలోనూ ఇలానే జరిగింది. ఆయన్ను ఓ కేసులో అదుపులోకి తీసుకుంది సీఐడీ. ఆ రాత్రి కస్టడీలో తనను దారుణంగా కొట్టారని.. థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామ ఆరోపించారు. నల్లగా కమిలిపోయిన కాళ్లు, చేతులను చూపించారు. ఫోటోలను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దానిపై కమిటీ వేసి విచారణ కూడా చేపించింది న్యాయస్థానం. ఇప్పటికీ రఘురామను కొట్టిన విషయం ఎటూ తేలనేలేదు.
ఇప్పుడు టీడీపీ నేత పట్టాభిరామ్ ను పోలీసులు కొట్టారని అంటున్నారు. ముసుగు వేసుకొచ్చి మరీ కొట్టారని.. ప్రాణహాని ఉందని ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. మరి, రఘురామ కేసులా.. పట్టాభి వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో?